
ఐపీఎల్ పదమూడో సీజన్ మ్యాచ్ టైమింగ్స్ లో ఎలాంటి మార్పు లేదు. గత సీజన్ల మాదిరిగానే ఈ సారి కూడా రాత్రి 8 గంటల నుంచే ఆట మొదలవుతుందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. టైమింగ్స్ మార్చాలని.. కనీసం అరగంట ముందుగా రాత్రి 7.30 నుంచి మొదలు పెట్టాలన్న పలు స్టేక్ హోల్డర్ల విజ్ఞప్తికి సోమవారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం తెలుపలేదు. కొత్త సీజన్ ఫైనల్ మే 28న ముంబైలో జరుగుతుందని గంగూలీ చెప్పాడు. ‘ఐపీఎల్ టైమింగ్స్ లో మార్పు లేదు. అయితే, డబుల్ హెడర్స్ను తగ్గించాలని నిర్ణయించాం . ఈ సా రి కేవలం ఐదు రోజుల్లోనే రెండేసి మ్యాచ్ లు (సా 4, రా. 8నుంచి) ఉంటాయి. ఫైనల్ ముంబైలో జరుగుతుంది. ఈ సీజన్ లో కాంకషన్ సబ్ స్టిట్యూట్ , నో బాల్ రూల్ (థర్డ్ అంపైర్కు నిర్ణయాధికారం)ను కూడా కొత్తగా యాడ్ చేస్తున్నాం ’ అని తెలిపాడు. మార్చి 29న కొత్త సీజన్ మొదలవనుండగా.. టాప్ ఇంటర్నేషనల్ క్రికెటర్లతో అంతకంటే ముందే ‘ఆల్ స్టార్స్గేమ్ ’ నిర్వహించాలని బోర్డు నిర్ణయించిందన్నాడు.మూడు రోజుల పాటు జరిగే ఈ పోరుకు ఇంకా వేదిక నిర్ణయించలేదన్నాడు. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని విరాళంగా ఇస్తామన్నాడు.