దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి రావడానికి లాక్ డౌన్ బాగా ఉపయోగపడుతోందని చెప్పారు హైదరాబాద్ లోని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం మరికొన్నాళ్లు లాక్ డౌన్ కొనసాగించడం మేలని అన్నారు. అలా వీలుకాని పక్షంలో సోషల్ డిస్టెన్స్ ప్రొటోకాల్ కఠినంగా అమలు చేస్తూ పాక్షిక లాక్ డౌన్ అయినా ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సూచనల ప్రకారం ప్రజలంతా లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్ ప్రొటోకాల్ ను పక్కాగా పాటిస్తే జూన్ చివరి కల్లా కరోనా వ్యాప్తి కంట్రోల్ లోకి రావచ్చని రాకేశ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. దీనిలో ఏదైనా లోపాలు జరిగి.. మనిషికీ మనిషికి మధ్య దూరం పాటించడంలో విఫలమైతే ఏడాది చివరికి కూడా వైరస్ ను కట్టడి చేయడం కష్టమేనని అన్నారు.
భారత్ లో కరోనా బలహీనంగా ఉందా?
ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో వ్యాపిస్తున్న కరోనా వైరస్ కొంత మేర బలహీనమైనదని చెప్పలేమని, దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెప్పారు డాక్టర్ రాకేశ్ మిశ్రా. ఈ వైరస్ జీనోమ్ పై సీసీఎంబీలో తమ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారని తెలిపారు. ఇది నిరంతరం తన జన్యు రూపాన్ని మార్చుకుంటోందని గుర్తించినట్లు చెప్పారు. ల్యాబ్ లో ఆ వైరస్ ను జనరేట్ చేసి దాని కణాల్లో గ్రోత్ ఎలా ఉందన్నది పరిశీలిస్తున్నామన్నారు. వైరస్ ను ఎదుర్కోగలిగే యాంటీ బాడీలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.