సిట్ ఎంక్వైరీపై నమ్మకం లేదు ; షర్మిల

సిట్ ఎంక్వైరీపై నమ్మకం లేదు ; షర్మిల
 
  • సిట్ ఎంక్వైరీపై నమ్మకం లేదు
  • పేపర్ లీకేజీ కేసులో కేటీఆర్ పాత్రపై విచారణ జరగాలి
  • బేగంబజార్ పీఎస్​లో వైఎస్సార్టీపీ చీఫ్​ షర్మిల ఫిర్యాదు
  • రాష్ట్రంలో డిజిటల్  సెక్యూరిటీ లేదని విమర్శ

హైదరాబాద్, వెలుగు : పేపర్ లీకేజీ కేసులో సిట్ ఎంక్వైరీపై నమ్మకం లేదని, ప్రగతిభవన్ ఆదేశాల ప్రకారమే విచారణ జరుగుతున్నదని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల విమర్శించారు. ఈ వ్యవహారంలో ఐటీ శాఖ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని, అందుకే ఆ శాఖ మంత్రి కేటీఆర్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం బేగంబజార్ పోలీస్ స్టేషన్​లో షర్మిల ఫిర్యాదు చేశారు. తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ఐపీ అడ్రస్, పాస్​వర్డ్ సాయంతో సిస్టమ్ హ్యాక్ చేసి పేపర్ లీక్ చేశారు. అంత ఈజీగా సిస్టమ్ వివరాలు తెలుసుకోవడం ఎలా సాధ్యమైంది? మన రాష్ట్రంలో పాస్​వర్డ్​ తెలిస్తే ఏమైనా చేయొచ్చా? ఐటీ శాఖ ఏం చేస్తున్నది”అని షర్మిల ప్రశ్నించారు. 

ప్రతీ సిస్టమ్​కు ఆడిట్ జరగాలి

‘‘మన రాష్ట్రంలో ప్రతీ సిస్టమ్​కు ఆడిట్ జరగాలి. సిస్ట మ్​కు డిజిటల్ సెక్యూరిటీ ఉందా? ఫైర్ వాల్స్ ప్రొటెక్షన్ ఉందా? అధికారి ఓటీపీ, ఫింగర్ ప్రింట్ వంటి పద్ధతులు ఉన్నాయా? అనే వాటిపై ఆడిట్ చేయాలి. ఒక వేళ ఆడిట్​ చేసి ఉంటే వాటి సర్టిఫికెట్లు ఉంటాయి. టీ ఎస్పీఎస్సీ కేసులో ఆ సర్టిఫికెట్లు బయటపెట్టాలి”అని షర్మిల డిమాండ్​ చేశారు. ‘‘పేపర్​ లీకేజీతో ప్రభుత్వానికి సంబంధం ఎందుకు ఉండదు? సిట్ దర్యాప్తు చేసి దోషులు ఎవరని చెప్పకముందే ఇద్దరే ఈ తప్పు చేశారని కేటీఆర్ ఎలా చెబుతారు? ఈ వ్యవహారంలో కేటీఆర్, ఆయన పీఏకి సంబంధం ఉంది”అని షర్మిల ఆరోపించారు. 

ప్రగతి భవన్​ డైరెక్షన్​లోనే దర్యాప్తు

సిట్ లో ఎవరి పేర్లుండాలి, ఎవరిని దోషులుగా చేర్చాలి, ఎలా దర్యాప్తు చేయాలనేది ప్రగతి భవన్​ నిర్ణయిస్తున్నదని షర్మిల విమర్శించారు. పేపర్​ లీకేజీ చిన్న విషయమే అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. సూత్రధారులను తప్పించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. 
ఐటీ శాఖ వైఫల్యం కారణంగానే పేపర్​ లీకైందన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని విమర్శించారు. మళ్లీ ఎగ్జామ్స్ పెడుతున్నా.. సిస్టమ్ హ్యాక్ అవదని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు.