
బీహార్ సీఎం నితీష్ కుమార్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్షాల ఐక్యతపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తనకు ప్రధాని కావాలనే కోరిక లేదని నితీష్ స్పష్టం చేశారు. ‘‘ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. సాధారణ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తా’’ అని నితీష్ చెప్పారు.
ఎన్డీఏ నుంచి వైదొలిగిన నితీష్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మహాకూటమి ఏర్పాటు తర్వాత రాహుల్..నితీష్ కలవడం ఇదే తొలిసారి. త్వరలోనే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తో పాటు పలువురు వామపక్ష నేతలను ఆయన కలవనున్నారు. ఇటీవలె బీహార్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ నితీష్ తో సమావేశమై జాతీయ రాజకీయాలు చర్చించారు.