కేరళ బాలల హక్కుల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్కూళ్లల్లో సార్, మేడమ్ అనే పదాలు వాడొద్దని.. ఉపాధ్యాయులను టీచర్ అని పిలవాలని పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా.. బాలల హక్కుల కమిషన్ విద్యాశాఖను ఆదేశించింది. టీచర్ అనే పదం మహిళలకు, పురుషులకు వర్తిస్తుందని వివరించింది. విద్యార్థి దశలో ఉన్నప్పుడే పిల్లలకు స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమేనని చెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.
కేరళ స్టేట్ కమిషన్ ప్యానల్ ఛైర్ పర్సన్ శ్రీ కేవీ మనోజ్ కుమార్, విజయ్ కుమార్ తో కూడిన ధర్మాసనం.. పాఠశాలల్లో కేవలం టీచర్ అనే పదాన్ని మాత్రమే ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని.. గత బుధవారం విద్యాశాఖకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే సార్, మేడమ్ అని కాకుండా టీచర్ అని పిలవడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య అనుబంధం మరింతగా పెరుగుతుందని బాలల హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. సార్, మేడం అనే పదాలకు స్వస్తి చెప్పాలంటూ ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడంతోనే చర్యలు తీసుకున్నట్లు కొందరు చెబుతున్నారు. తాజా ఉత్తర్వుల అమలు తీరుపై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని బాలల హక్కుల కమిషన్ కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.