
- వివాదంపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై బోర్డు పెద్దల చర్చ
- కోహ్లీ కామెంట్స్పై స్పందించేందుకు గంగూలీ నో
- ఆ విషయం బోర్డే చూసుకుంటుందన్న బీసీసీఐ బాస్
- సౌతాఫ్రితాతో టెస్టు సిరీస్ దృష్ట్యా ఇప్పుడే ఎలాంటి చర్యలొద్దని నిర్ణయం!
కోల్కతా: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సౌతాఫ్రికా వెళ్తూ వెళ్తూ రాజేసిన అగ్గి ఇప్పట్లో చల్లారేలా కనిపించటం లేదు. విరాట్, బీసీసీఐ మధ్య మొదలైన యుద్ధం మరింత తీవ్రమయ్యేలా కనిపిస్తోంది. వన్డే కెప్టెన్సీ వేటుపై కోహ్లీ చేసిన కామెంట్స్పై స్పందించేందుకు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ పూర్తిగా నిరాకరించాడు. వ్యవహారాన్ని బోర్డు సరైన రీతిలో పరిష్కరించుకుంటుందని చెప్పాడు. సౌతాఫ్రికా ఫ్లైట్ ఎక్కేముందు బుధవారం మీడియాతో మాట్లాడిన విరాట్.. బోర్డుపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. టీ20 కెప్టెన్సీవదులుకోవద్దని తనను ఎవరు అడగలేదని, వన్డే కెప్టెన్సీ వేటు గురించి టెస్ట్ టీమ్ సెలెక్షన్ అప్పుడే చెప్పారని ప్రకటించాడు. టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని విరాట్ను రిక్వెస్ట్ చేశామంటూ అంతకుముందు బోర్డు ప్రెసిడెంట్ సౌరవ్ చేసిన వ్యాఖ్యలకు ఇవి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. దీంతో బోర్డు, విరాట్ మధ్య అసలేం జరుగుతోందనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో తన హోమ్ టౌన్ కోల్కతాలో గురువారం మీడియా ఎదుటపడిన దాదా.. ఈ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరించాడు. ‘ఎలాంటి ప్రకటన చేసేది లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్లు లేవు. మేమే ఈ సమస్యను పరిష్కరించుకుంటాం. విషయాన్ని బీసీసీఐకి వదిలేయండి’ అంటూ వెళ్లిపోయాడు. దాంతో, విరాట్, బీసీసీఐ మధ్య మొదలైన వార్ ఎలా ముగుస్తుందోనని క్రికెట్ ఫ్యాన్స్ టెన్షన్లో ఉన్నారు.
కొంత టైమ్ వెయిట్ చేయాలని..
కోహ్లీ విషయంలో బీసీసీఐ కొంత టైమ్ వెయిట్ చేయాలని చూస్తోంది. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఇప్పుడే ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే అది టీమ్, ప్లేయర్ల కాన్ఫిడెన్స్ను దెబ్బతీస్తుందని, దానివల్ల సమస్య మరింత పెద్దది అవుతుందని భావిస్తోంది. అందుకే కోహ్లీ వ్యాఖ్యలపై స్పందించడానికి గంగూలీ నిరాకరించాడు. సూపర్స్టార్ ఇమేజ్ ఉన్న టెస్టు కెప్టెన్... ప్రెసిడెంట్ కుర్చీలో ఉన్న ఓ లెజెండరీ కెప్టెన్తో వ్యాఖ్యలతో విభేదించిన సందర్భాలు గతంలో లేవు. దాంతో, కోహ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత బీసీసీఐ పెద్దలంతా ఆగ్రహంగా ఉన్నారట. కానీ, సమస్యను వెంటనే పరిష్కరించేందుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తే అది బెడిసికొడుతుందేమోనని భావించారని సమాచారం. ఈ విషయంలో గంగూలీ, సెక్రటరీ జైషా సహా బీసీసీఐ పెద్దలంతా బుధవారమే జూమ్ కాల్లో మాట్లాడుకున్నట్టు సమాచారం. కోహ్లీ గురించి ఎలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టొద్దని, మీడియాకు ఎలాంటి ప్రకటన ఇవ్వొద్దని అంతా డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.
గంగూలీ, కోహ్లీ కలిసి మాట్లాడుకుంటే?
ప్రెసిడెంట్ ఆఫీస్ గౌరవంతో ముడిపడి ఉన్న ఈ సెన్సిటివ్ ఇష్యూను ఎలా డీల్ చెయ్యాలనే దానిపై ఎక్స్ఫర్ట్స్ ఒపీనియన్ తీసుకున్నారని బోర్డు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ క్రమంలో ప్రెసిడెంట్ గంగూలీ, కెప్టెన్ కోహ్లీ ఇద్దరూ సమావేశమై.. కెప్టెన్సీ మార్పు విషయంలో భిన్నాభిప్రాయాలు, కమ్యూనికేషన్ ఎక్కడ లోపించిందో స్పష్టంగా మాట్లాడుకోవడమే సమస్యకు సరైన పరిష్కారంగా కనిపిస్తోంది. కానీ, ఇప్పటికైతే గంగూలీ లేదంటే జై షా.. కోహ్లీతో మాట్లాడే చాన్స్ కనిపించడం లేదు.
విరాట్ ప్రొటోకాల్ బ్రేక్ చేశాడా?
సాధారణంగా సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్.. బోర్డు గురించి, ఆఫీస్ బేరర్ల గురించి విమర్శలు చేయకూడదు. కానీ, కోహ్లీ తనకు తానుగా ప్రకటన చేయకుండా.. ఓ ప్రశ్నకు బదులుగానే అసలు ఏం జరిగిందనే దానిపై వివరణ ఇచ్చాడు. ఇది ప్రొటోకాల్ను బ్రేక్ చేసినట్టు అవుతుందా? అనే ప్రశ్న వస్తోంది. కోహ్లీ స్టేట్మెంట్స్ను పరిశీలిస్తే కెప్టెన్సీ తీసేయడంపై అతనెక్కడా అధికారిక అసంతృప్తి వ్యక్తం చేయలేదు. కాబట్టి ఈ సమస్యకు అంత ఈజీగా పరిష్కారం దొరికేలా లేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు కెప్టెన్ల (కోహ్లీ, రోహిత్) మధ్య అభిప్రాయబేధాలుగా మొదలై, కెప్టెన్ వర్సెస్ బోర్డుగా మారిన ఈ ఇష్యూ సుదీర్ఘంగా సాగుతున్న చెస్ గేమ్లా కనిపిస్తోంది. తన కెప్టెన్సీ తీసేసిన సెలెక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని కోహ్లీ చెప్పిన నేపథ్యంలో బీసీసీఐ పెద్దలు కూడా కాస్త తగ్గి ఈ గేమ్ను గౌరవంగా డ్రా చేసుకుంటేనే ఇండియన్ క్రికెట్ గెలుస్తుంది. మరి గంగూలీ అండ్ కో ఏం చేస్తుందో చూడాలి.