న్యూఢిల్లీ: జార్ఖండ్లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి బలంగా ఉందని రాష్ట్ర సీఎం చంపయీ సోరెన్ తెలిపారు. రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వానికి ఎటువంటి ముప్పు లేదని చెప్పారు. సొంత పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులివ్వడంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వార్తలు వెలువడుతుండటంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం చంపయీ సోరెన్ న్యూఢిల్లీలో విలేకర్లతో మాట్లాడారు. “మా కూటమి బలంగా ఉంది. ఎటువంటి సమస్య లేదు. ఎమ్మెల్యేల అంశం అనేది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం. వాళ్లు పరిష్కరించుకుంటారు.
ఆ అంశం గురించి నేను చెప్పెదేమీ లేదు. కాంగ్రెస్, జేఎంఎంకు మధ్య ఎటువంటి విభేదాలు లేవు. అంత బాగానే ఉంది”అని చంపయీ సోరెన్ పేర్కొన్నారు. కాగా, తమ పార్టీకి చెందిన ఆలంగిర్ ఆలమ్, రామేశ్వర్ ఓరాన్, బన్నా గుప్తా, బాదల్ పత్రలేఖ్కు మంత్రులుగా అవకాశం ఇవ్వడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి స్థానంలో కొత్త వారికి చాన్స్ ఇవ్వకపోతే ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ సెషన్ను బాయ్కాట్ చేసి జైపూర్కు వెళ్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు.