
హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్న సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురికి నిరాశే మిగిలింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎవరికీ టికెట్ కేటాయించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనే టికెట్ల కోసం చాలా మంది సినీ ప్రముఖులు ట్రై చేశారు. అప్పుడు అవకాశం దక్కకపోవడంతో.. లోక్సభ ఎన్నికల్లో అయినా పోటీ చేద్దామనుకున్నారు. చివరికి ఇప్పుడు కూడా టికెట్లు ఇవ్వకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ 16, కాంగ్రెస్ 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ మొత్తం 17 మందిని అనౌన్స్ చేసింది. వీరిలో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఎవరూ లేరు. ఒకట్రెండు రోజుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నాయి.
నిర్మాత బండ్ల గణేశ్కు చుక్కెదురు
ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ కాంగ్రెస్ నుంచి మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్ నుంచి ఆయన కాంగ్రెస్లో యాక్టివ్గా ఉన్నారు. గాంధీభవన్లో నిర్వహించే ప్రెస్మీట్లకు అటెండ్ అవుతూ.. బీఆర్ఎస్ లీడర్లు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుపై విమర్శలు చేస్తున్నారు. మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని సీఎం రేవంత్తో పాటు కీలక నేతలను కోరుతూ వచ్చారు. రేవంత్ సిట్టింగ్ ఎంపీ స్థానం కావడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన సునీతా మహేందర్ రెడ్డికి ఆ స్థానం కేటాయించడంతో బండ్ల గణేశ్కు నిరాశే మిగిలింది. ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ నేతలు ఆయన్ను బుజ్జగించినట్టు సమాచారం.