శంషాబాద్ ప్రాంతంలో పెద్దపులి సంచారం అవాస్తవం

శంషాబాద్ ప్రాంతంలో పెద్దపులి సంచారం అవాస్తవం

హైదరాబాద్: శంషాబాద్ ప్రాంతంలో పెద్ద పులి సంచారం అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని తెలిపింది అటవీ శాఖ. శంషాబాద్ ఇందిరమ్మ కాలనీలో పులి కనిపించిందని గత రాత్రి నుంచి కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అక్కడికి వెళ్లి పరిసరాలను గమనించటంతో పాటు, స్థానికులతో మాట్లాడిన అటవీ శాఖ అధికారులు తప్పుడు సమాచారం అని తేల్చారు.

శంషాబాద్ పరిసర ప్రాంతాలకు పులి వచ్చే అవకాశమే లేదని, అవాస్తవ ప్రచారాలతో స్థానికులు భయాందోళనలు చెందే అవకాశం ఉందని అటవీ శాఖ తెలిపింది. వన్యమృగాల సంచారంపై ఏదైనా  సమాచారం ఉంటే ముందుగా అటవీ శాఖ అధికారులతో ధృవీకరించుకోవాలని కోరింది.