నో టు లెట్!.. హైదరాబాద్లో అద్దెకు దొరకని ఇండ్లు 

నో టు లెట్!..  హైదరాబాద్లో అద్దెకు దొరకని ఇండ్లు 
  •     సింగిల్, డబుల్ బెడ్రూంలు ఖాళీ ఉండట్లే 
  •     ఎంతవెతికినా దొరక్క టెనెంట్స్​కు ఇబ్బందులు
  •     తప్పని పరిస్థితుల్లో  ఔటర్ బయటకు  షిఫ్ట్
  •     డిమాండ్, పెరిగిన కిరాయిలే కారణం 

హైదరాబాద్, వెలుగు : సిటీ శివారులో ఇండ్లు అద్దెకు దొరకడం లేదు. కరోనా తర్వాత గతేడాది వరకు ఎక్కడ చేసినా టులెట్ బోర్డులు కనిపించేవి. ఇప్పుడు 10 కాలనీలు తిరిగినా ఎక్కడా ఖాళీగా ఉండడం లేదు. సింగిల్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఎంత తిరిగినా దొరక్కపోతుండగా టెనెంట్స్​ఔటర్ రింగ్ రోడ్డు దాటి బయటి  ప్రాంతాలకు వెళ్తున్నారు.  కొంతకాలం కిందట జాబ్​లు చేసేవారు కోర్​ సిటీలో రెంట్లు ఎక్కువగా ఉంటాయని శివారు ప్రాంతాలు వెళ్లేవారు. ఇప్పుడు అక్కడ కూడా రెంటుకు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇండ్లకు డిమాండ్ ఉండడంతో  టులెట్ బోర్డులు కనిపించడంలేదు. శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం సింగిల్ బెడ్ రూమ్ ఇండ్ల కిరాయిరూ.7 వేల నుంచి 9 వేల వరకు ఉంది. డబుల్ బెడ్ రూమ్ అయితే రూ.11 వేల నుంచి 15 వేల వరకు అద్దెలు ఉన్నాయి. దీంతో మధ్యతరగతి వారు కిరాయిలు తక్కువగా ఉన్న ప్రాంతాలకు షిఫ్ట్ అవుతున్నారు. కొందరు దూరమైనా సరే అద్దెలు తక్కువగా ఉండే ప్రాంతాలనే చూసుకుంటున్నారు. దీంతో ఔటర్ బయట ఉన్న ఏరియాలకు రెంటుకు వెళ్తున్నారు.   

గతేడాది వరకు ఎక్కడ చూసినా..

సిటీ శివారు ప్రాంతాలైన బోడుప్పల్, పీర్జాదిగూడ,  నిజాంపేట, బండ్లగూడ జాగీర్‌ తదితర మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు నార్సింగి, మణికొండ లాంటి మున్సిపాలిటీల్లో గతేడాది వరకు ఎక్కడ చూసినా టులెట్ బోర్డులు కనిపించేవి. కరోనా టైమ్​లో మూడు, నాలుగు ఇండ్లలో ఒకటి కనిపించగా.. ఇప్పుడు ఎక్కడ ఖాళీగా ఉండడం లేదు. సిటీలో పనిచేసే చిరుద్యోగులతో పాటు రూ.20 నుంచి 30 వేల శాలరీలు ఉన్నవారు  ఎక్కువగా శివారు ప్రాంతాల్లోనే ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు.  అక్కడ అపార్టుమెంట్లతో పాటు విలాసవంతమైన ఇండ్లలో అద్దెకు ఉంటుండగా ఐటీ ఉద్యోగులతో పాటు  ఉన్నతస్థాయిలో ఉన్న వారు కూడా తమ స్థాయికి తగినట్టుగా ఇండ్లలో రెంటుకు వెళ్తున్నారు. 

 నిర్మాణాలప్పుడే అడ్వాన్స్​లు

ప్రస్తుతం శివారు ప్రాంతాల్లో అద్దె ఇండ్లకు డిమాండ్ ఏర్పడింది. ప్రధానంగా సింగిల్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఎక్కువగా ఉంది. అయినా ఎంత వెతికినా ఇండ్లు ఖాళీగా ఉండకపోతుండగా నిర్మాణ దశలోనే ఓనర్లతో మాట్లాడుకుని అడ్వాన్స్​లు ఇస్తున్నారు. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత షిఫ్ట్ అవుతున్నారు. రెండు, మూడు నెలల ముందు అద్దెలకు ఉండే వారు ఓనర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇలా డిమాండ్ పెరుగుతుండగా ఆ ప్రభావం అద్దెలపైనా పడింది. ఓనర్లు కూడా ప్రతి ఏటా ఇండ్ల కిరాయిలు పెంచుతున్నారు. 

అద్దెలు పెరిగిపోతుండగా.. 

కోర్ సిటీలో అద్దెలు పెరిగిపోతుండగా కొందరు అంత భారం మోయలేక వేరే ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. శివారుకు వెళ్తే  జర్నీ ఇబ్బందులు వస్తాయని అనుకుంటున్నారు. విదేశాల్లో మాదిరిగా డబుల్, ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లను తీసుకుని షేర్ చేసుకుంటున్నారు. ఇలా ఒకే ఇంట్లో  ఇద్దరు, ముగ్గురు ఫ్యామిలీలతో ఉండేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు.  ఇంకొందరు పెయింగ్ గెస్ట్​గా ఉంటూ అద్దెల నుంచి తప్పించుకుంటున్నారు. 

భవిష్యత్​లో మరింత దూరం 

భవిష్యత్​లో  ఔటర్ రింగ్ బయట ప్రాంతాల్లో కూడా అద్దెకు ఇండ్లు దొరకడం కష్టంగా మారనుంది. సిటీలో రోజురోజుకు జనాభా పెరుగుతుండడంతో పాటు మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా వస్తున్నారు.  కుటుంబసభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంటుండగా అద్దె ఇండ్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు కోర్ సిటీలో మధ్యతరగతి వారు అద్దెల భారం మోయలేక దూరమైన సరే అనుకుని శివారు ప్రాంతాలకు వెళ్తున్నారు. అక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడుతుండగా మరింత దూరం వెళ్లేందుకు టెనెంట్స్​ఇంట్రెస్ట్ చూపుతున్నారు. తప్పనిసరి పరిస్తితుల్లో వెళ్లాల్సి వస్తుందని కొందరు టెనెంట్స్​ చెబుతున్నారు.

“ బండ్లగూడ జాగీర్​కు చెందిన ప్రవీణ్ ప్రైవేట్ ఎంప్లాయ్. సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో రెంట్​కు ఉండేవాడు. ఖాళీ చేద్దామనుకుని అదే ప్రాంతంలో వేరే చోట ఎంత వెతికినా రెంట్​కు ఇల్లు దొరకలేదు. వారం పాటు వెతికిన ప్రవీణ్​కు ఎక్కడా ‘టు లెట్’ బోర్డులు కనిపించ లేదు. శివారులో ప్రస్తుతం సింగిల్ బెడ్ రూమ్ రూ.7 వేల నుంచి 9 వేలు ఉండగా, డబుల్ బెడ్ రూమ్​కు రూ.11 వేల నుంచి 15 వేల వరకు అద్దె ఉంది. దీంతో ఔటర్ బయట హిమాయత్​సాగర్​కు  షిఫ్ట్ అయ్యాడు. నాలుగేండ్ల కిందట ప్రవీణ్ కార్వాన్ నుంచి లంగర్ హౌస్​కి షిఫ్ట్ కాగా.. అక్కడ రెంట్ పెరగడంతో బండ్లగూడ జాగీర్​కు మారాడు. అటు నుంచి సిటీ శివారు బయటకు వెళ్లాడు.’’