కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు 22న నోటిఫికేషన్

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు  22న నోటిఫికేషన్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయింది. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈనెల 22న నోటిఫికేషన్ జారీ చేస్తామని, 24 నుంచి 30 వరకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 17న అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని తెలిపారు. 

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల చేసిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ అన్ని పీసీసీ కార్యాలయాల్లో ఓటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రతినిధులందరికీ పార్టీ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ కొనసాగనుందని వివరించారు.  ఐడెంటిటీ కార్డుపై క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, ఐడీ కార్డుపై ఫోటో లేని వారు.. ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 20 తర్వాత ఓటర్ల లిస్ట్ అందుబాటులోకి పెడతామని, నిన్న ప్రదేశ్ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించామని వివరించారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక పారదర్శకంగా జరుగుతుందని, ఎవరూ ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఒక్కరి కంటే ఎక్కువ మంది పోటీ పడితే ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు.   

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్

  • నోటిఫికేషన్ జారీ: సెప్టెంబర్ 22 
  • నామినేషన్ల దాఖలు: సెప్టెంబర్ 24 నుంచి
  • నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ : సెప్టెంబర్ 30
  • ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక తేదీ:  అక్టోబర్ 17