చలికి వణుకుతున్న ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, కాశ్మీర్

చలికి వణుకుతున్న ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, కాశ్మీర్

లక్నో/న్యూఢిల్లీ: నార్త్ ఇండియాను చలి వణికిస్తోంది. చలిగాలుల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్​లోని కాన్పూర్​లో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్​తో గురువారం ఒకేరోజు 25 మంది చనిపోయారు. వీళ్లలో 17 మంది ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. చలికి రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటుతో కొందరు, బ్రెయిన్ ​స్ట్రోక్​తో ఇంకొందరు చనిపోయారని డాక్టర్లు శుక్రవారం వెల్లడించారు. కాగా, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్​లలో కూడా చలి పెరిగింది. పొగమంచు విపరీతంగా కురుస్తోంది. ఢిల్లీలో అయితే హిల్ స్టేషన్ల కంటే తక్కువ టెంపరేచర్ నమోదైంది. ఇక్కడ శుక్రవారం మినిమమ్ టెంపరేచర్ 4 డిగ్రీలు నమోదు కాగా.. ఇది డెహ్రాడూన్ (4.4 డిగ్రీలు), ధర్మశాల(5.4), సిమ్లా(6.2), ముస్సోరీ (6.4), నైనిటాల్ (6.5), డల్హౌసీ (8.7) కంటే తక్కువని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలోని అయాన్ నగర్ లో మినిమమ్ టెంపరేచర్ 1.8 డిగ్రీలు, లోధి రోడ్ లో 3.8, రిడ్జ్ లో 3.3 డిగ్రీలకు పడిపోయిందని పేర్కొంది. పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 30 విమానాలు ఆలస్యమయ్యాయి. ఢిల్లీకి రావాల్సిన 26 రైళ్లు ఆలస్యంగా వచ్చాయి. 

రాజస్థాన్​లో 0.7 డిగ్రీలు... 

రాజస్థాన్​లో నైట్ టెంపరేచర్లు మరింత పడిపోయాయి. గురువారం రాత్రి ఫతేపూర్​లోని సికర్ లో 0.7, చురులో 1 డిగ్రీల మినిమమ్ టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఢిల్లీ పక్కనున్న హర్యానా, పంజాబ్​లోనూ చలి విపరీతంగా ఉంది. శుక్రవారం హర్యానాలోని నార్నౌల్ లో 2.5 డిగ్రీలు, పంజాబ్ లోని బాలాచూర్ లో 3.5 డిగ్రీల మినిమమ్ టెంపరేచర్ నమోదైంది. చండీగఢ్​లో 5 డిగ్రీలు రికార్డయింది. జమ్మూకాశ్మీర్​లోనూ చలి ఎక్కువగా ఉంది. గురువారం రాత్రి శ్రీనగర్​లో మైనస్ 5.5, కుప్వారాలో మైనస్ 5.6, కాజీగుండ్​లో మైనస్​ 5.8 డిగ్రీల మినిమమ్ టెంపరేచర్లు నమోదయ్యాయి. కాగా, శనివారం నుంచి చలి తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. టెంపరేచర్లు క్రమంగా పెరుగుతాయని చెప్పింది.