
ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావెద్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కు వెళ్లిన ఆయన ఆ దేశంలోనే విమర్శలు చేశారు. 26/11 ముంబయి ఉగ్రపేలుళ్ల ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులు ఇప్పటికీ లాహోర్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పారు. ప్రముఖ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ స్మారకార్థం ఇటీవల లాహోర్లో ఫైజ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జావెద్ అక్తర్ కు ఆహ్వానం లభించడంతో ఆయన పాక్లో పర్యటించారు. ఈ ఫెస్టివల్లో పాల్గొన్న ఆయన.. అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
భారత్-పాక్ సంబంధాలు, ముంబయి ఉగ్రదాడుల ఘటనను ప్రస్తావించారు. ‘ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. పైగా ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి. వాటిని తగ్గించాల్సిన అవసరముంది. ముంబయి నగరంలో ఉగ్రవాదులు ఎంతటి బీభత్సాన్ని సృష్టించారో చూశాం. వారు నార్వే లేదా ఈజిప్టు నుంచి వచ్చిన వారు కాదు. వాళ్లు ఇంకా మీ దేశంలోనే (పాకిస్తాన్) స్వేచ్ఛగా తిరుగుతున్నారు కదా. అలాంటప్పుడు భారత్ దాని గురించి ఫిర్యాదులు చేసినప్పుడు మీరు దాన్ని ప్రతికూలంగా తీసుకోవాల్సిన అవసరం లేదు’ అని జావెద్ అక్తర్ వ్యాఖ్యానించారు.
2008 నవంబరు 26న పాక్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థకు చెందిన 10 మంది ముష్కరులు ముంబయిలోకి చొరబడి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడుల్లో 9 మంది ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చారు. మరో ఉగ్రవాది అజ్మల్ కసబ్ను ప్రాణాలతో పట్టుకోగా.. నాలుగేళ్ల తర్వాత 2012లో అతడిని ఉరితీశారు.