- స్పీడ్ గా ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర సర్కారు
- సాగర్ బైపోల్ కౌంటింగ్ కు ముందే ఎలక్షన్ జరిగేలా ప్లాన్
- ఖరారైన ఓటర్ల ఫైనల్ లిస్టు.. 14న పోలింగ్ కేంద్రాల జాబితా రిలీజ్
- ఖాళీగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పోస్టుల ఎన్నికలూ వీటితోనే
మినీ మున్సిపల్ పోరుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెండు కార్పొరేషన్లతో పాటు 5 మున్సిపాలిటీలకు ఈ నెల 17 కల్లా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో 248 వార్డులకు ఓటర్ల ఫైనల్ లిస్టును అధికారులు ఆదివారం ప్రకటించారు. ఈ నెల 14న పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రకటించనున్నారు. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు సోమవారంతో శిక్షణ పూర్తవుతోంది. ఆ తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేసి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో డెవలప్మెంట్ కార్యక్రమాలను అధికార పార్టీ ఇప్పటికే వేగవంతం చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పోస్టులకూ ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.
సాగర్ ఎలక్షన్ రిజల్ట్ కన్నా ముందే
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఈ నెల 17న జరగనుంది. ఓట్ల లెక్కింపు మే 2న చేపట్టనున్నారు. ఈ కౌంటింగ్కు ముందే వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్, జడ్చర్ల మున్సిపాలిటీలకు పోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో సిద్దిపేట మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ఈ నెల 15న ముగియనుంది. మిగతా వాటిల్లో స్పెషలాఫీసర్ల పాలన సాగుతోంది. సాగర్ కౌంటింగ్ పూర్తయిన ఒకట్రెండు రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్ఓ) నోటీసు ఇస్తారు. ఆ రోజు నుంచి 15వ రోజు పోలింగ్ జరగాలి. ఇందులో మూడ్రోజులు నామినేషన్, ఒక రోజు స్క్రుటినీ, మరో రోజు అప్పీల్, విత్డ్రా ఉంటుంది. ఆ తర్వాత క్యాంపెయినింగ్కు అవకాశం ఇస్తారు. ఈ లెక్కన 16వ తేదీన నోటిఫికేషన్ ఇస్తే ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఒకవేళ 17న జారీ చేస్తే మే 1న పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే మే డే రోజున ఎన్నికలు నిర్వహించొద్దని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఈ 5 రోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రూరల్ లోకల్ బాడీస్కూ..
రూరల్ లోకల్ బాడీస్లో ఖాళీగా ఉన్న పోస్టులకూ ఎలక్షన్స్ నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధమైంది. ఒక జడ్పీటీసీతో పాటు 60 ఎంపీటీసీ, 125 సర్పంచ్ స్థానాలతో పాటు 2,288 వార్డు సభ్యుల పోస్టులకు ఎన్నికలు నిర్వహించనుంది. మున్సిపల్ నోటిఫికేషన్తో పాటే వీటికీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిసింది.
ఎస్ఈసీ ఆఫీసులో 12 మందికి కరోనా
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి ఈ నెల 9న కరోనా పాజిటివ్గా తేలింది. క్వారంటైన్లో ఉన్న ఆయన.. ఫోన్లోనే ఎన్నికల నిర్వహణపై సమీక్షిస్తున్నారు. ఎస్ఈసీకి పాజిటివ్ రావడంతో ఆయన ఆఫీస్లోని వాళ్లంతా టెస్టు చేయించుకున్నారు. అందులో దాదాపు12 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఎస్ఈసీ ఆఫీసులో ఫైళ్లు, పనులకు ఇబ్బంది మొదలైంది. ఉన్న కొద్ది మంది స్టాఫ్లో సగం మందికి కరోనా రావడంతో 15, 20 రోజుల వరకు ఎవరూ ఆఫీస్కు వచ్చే అవకాశం లేదంటున్నారు. అయినా ఎన్నికల నిర్వహణపై ముందుకే వెళ్తున్నారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ ఎన్నికల అథారిటీ అధికారిగా వ్యవహరిస్తున్నారు. అవసరమైన సిబ్బందిని నియమించుకోవడం, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, భద్రత ఏర్పాట్లు, బ్యాలెట్ పత్రాల ముద్రణ సహా అన్నింటినీ వాళ్లే చూసుకుంటుండంతో సమస్య వచ్చినా సర్దుబాటు చేసుకుంటామని అధికారులు చెప్తున్నారు.
మే చివర్లో అనుకున్నా..
వాస్తవానికి మే మూడో వారంలో లేదా చివరి వారంలో మినీ పురపోరు నిర్వహించేందుకు సర్కారు తొలుత ఓకే చెప్పింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా తొందరపడలేదు. అయితే కరోనా కేసులు పెరుగుతుండటం, సెకండ్ వేవ్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో వెంటనే కసరత్తు మొదలుపెట్టినట్లు ఎస్ఈసీ అధికారులు చెప్తున్నారు. పైగా మే నెల మూడో వారంలో ఎండలు తీవ్రంగా ఉంటాయని అంటున్నారు. అయితే నాగార్జున్ సాగర్ బై ఎలక్షన్లో ఎలాంటి రిజల్ట్ వస్తుందోనని అధికార పార్టీ ఆందోళన చెందుతోంది. ఒకవేళ నెగెటివ్ రిజల్ట్ వస్తే ఆ ప్రభావం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉంటుందని అంతకు ముందే ఈ ఎలక్షన్స్ ముగించేలా ప్లాన్ చేసిందని పలువురు అంటున్నారు.