- అన్ని సొసైటీల్లో కలిపి 9,096 ఖాళీలు
- సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారుల ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: త్వరలో గురుకులాల జాబ్స్ నోటిఫికేషన్ రానుంది. ఆగస్టులో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇటీవల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు నోటిఫికేషన్ కోసం కసరత్తు చేస్తున్నారు. సొసైటీల వారీగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సోమవారం ఆయా శాఖల అధికారులు రివ్యూ నిర్వహించారు. అధికారులు పంపిన ప్రతిపాదనలు, సర్కారు ఆమోదించిన లెక్కను క్రాస్ చెక్ చేస్తున్నారు. మరోసారి పరిశీలించాక ఖాళీల వివరాలను గురుకులాల రిక్రూట్మెంట్ బోర్డుకు పంపనున్నారు. గురుకులాల్లో ఉన్న వివిధ రకాల పోస్టులను గురుకులాల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్ చేస్తారు. గతంలోనూ ఇదే విధంగా భర్తీ చేశారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీల్లో 9,096 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఎస్సీ గురుకులంలో 2,267, ఎస్టీ గురుకులంలో 1,514, బీసీ గురుకులంలో 3,870, మైనార్టీ గురుకులంలో 1,445 ఉన్నాయి. ఇందులో ఆర్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, హెల్త్ సూపర్వైజర్, జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్స్, టీజీటీ, వార్డెన్ తదితర పోస్టులు ఉన్నాయి. ఖాళీల భర్తీపై అధికారులు పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవన్నీ పూర్తవడానికి కొంత సమయం పట్టనుంది. సుమారు జులై చివరి వారంలో ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఆ తర్వాత అధికారులు ప్రభుత్వానికి వివరాలు పంపించనున్నారు. దీంతో ఆగస్టు మొదటి వారం లేదా ఆ తర్వాత నోటిఫికేషన్
వచ్చే చాన్స్ ఉంది.