పెద్ద చదువులు చదవాలన్న ఆమె కలకి పెండ్లితో బ్రేక్ పడింది. పిల్లలు, ఇంటి బాధ్యతలతో తీరిక ఉండేది కాదు. అయితే, పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక, ఖాళీ టైమ్లో మళ్లీ పుస్తకాలు అందుకుంది. భర్త ఎంకరేజ్మెంట్తో డిగ్రీ, పీజీతో పాటు బీఎడ్ కూడా చదివింది. ఆ తర్వాత అంగన్వాడి టీచర్ జాబ్కి ఎంపికైంది. ఇప్పుడు సూపర్వైజర్ గ్రేడ్-2 పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. గట్టిగా ప్రయత్నిస్తే, అనుకున్నది సాధించొచ్చని నిరూపించింది మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన వేముల శ్రీలత.
మందమర్రిలోని గాంధీనగర్లో ఉంటుంది శ్రీలత ఫ్యామిలీ. ఆమె భర్త కృష్ణ కోర్టు ఉద్యోగి. వీళ్లకు ఇద్దరు ఆడపిల్లలు. ఒకరు బీటెక్, మరొకరు ఇంటర్ చదువుతున్నారు. భర్త ఎంకరేజ్మెంట్తో పెండ్లితో ఆగిపోయిన చదువుని మళ్లీ కంటిన్యూ చేసింది శ్రీలత. 2005లో అంగన్వాడీ టీచర్ పోస్టుకి సెలక్ట్ అయింది. దాదాపు 17 ఏండ్లు తమ కాలనీలోని అంగన్వాడీలో టీచర్గా పని చేసింది. అయితే, అదే డిపార్ట్మెంట్లో పెద్ద జాబ్ చేయాలని ఉండేది ఆమెకు. సూపర్వైజర్ గ్రేడ్-2 ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయింది. ఫ్యామిలీ సపోర్ట్ కూడా లభించడంతో ఆ ఎగ్జామ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది.
పెద్ద జాబ్ టార్గెట్
అంగన్వాడీ టీచర్గా చేస్తూనే, పెద్ద జాబ్స్కి ప్రిపేర్ అయ్యేదాన్ని. 2012లో సీడీపీవో (చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్) సూపర్ వైజర్ గ్రేడ్-1కు సెలెక్ట్ అయ్యా. అయితే, అర్హతకు మించి చదువుకున్నానని ఆ పోస్ట్ నాకు ఇవ్వలేదు. మూడు నెలల కిందట అంగన్వాడి సూపర్వైజర్ గ్రేడ్2 పోస్టు నోటిఫికేషన్ వచ్చింది. ఇంటి దగ్గరే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యా. అయితే, స్టేట్ ఫస్ట్ వస్తానని మాత్రం అనుకోలేదు. పెద్ద జాబ్ చేయాలనే కోరిక నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది.
::: మందమర్రి, వెలుగు