హైదరాబాద్, వెలుగు: నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) హైదరాబాద్ చాప్టర్, హెచ్ఐసీసీలో ‘ఇండియన్ రెస్టారెంట్ ఇండస్ట్రీ, ఇండియన్ రెస్టారెంట్ కాంక్లేవ్ 2022’ను మంగళవారం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్ఆర్ఏఐ తెలంగాణ ప్రభుత్వ వాణిజ్యం & పరిశ్రమల శాఖతో కలసి టీఎస్ ఐపాస్ ద్వారా ఫుడ్ సర్వీస్ సెక్టార్ కోసం భారతదేశంలోనే తొలిసారిగా సింగిల్ విండో అప్లికేషన్ను ఆవిష్కరించింది. ఈ పోర్టల్ సింగిల్ విండో లైసెన్స్లను రెగ్యులేట్ చేస్తుంది. వేగంగా ప్రాసెసింగ్ ఉంటుంది. పోర్టల్ కేవలం రెస్టారెంట్లు, బార్లు ఫుడ్ అవుట్లెట్లకు మాత్రమే కాకుండా కియోస్క్లు, బేకరీలు, కేఫ్లు క్లౌడ్ కిచెన్లకు కూడా టీఎస్ ఐపాస్ వర్తిస్తుంది. రెస్టారెంట్ పరిశ్రమకు చెందిన వాళ్లతోపాటు విదేశీ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, బ్యూరోక్రాట్లతో సహా వెయ్యి మందికి పైగా ప్రతినిధులు కాన్క్లేవ్కు వచ్చారు.
ఈ కార్యక్రమంలో -బార్బెక్యూ నేషన్ సీఈఓ రాహుల్ అగర్వాల్, మెక్ డొనాల్డ్స్ సీఈఓ నిషిత్ పాండే, ఆలివ్ బార్ & కిచెన్ గ్రూప్ ఎండీ ఏడీ సింగ్, ఆల్మండ్ హౌస్ యజమాని చైతన్య ముప్పాల వంటి ప్రముఖులు చర్చలు జరిపారు. ఇన్ఫర్మేటివ్ ప్యానెల్ డిస్కషన్లకు, వర్క్షాప్లకూ ఈ కార్యక్రమం వేదికయింది. రియల్ ఎస్టేట్ ట్రెండ్ల గురించి, విజయవంతమైన క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని సృష్టించడంపై 50 మందికి పైగా మాట్లాడారు. కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ చీఫ్ గెస్టుగా వచ్చారు. ఈ సందర్భంగా దాదాపు రూ. 500 కోట్ల కమిట్మెంట్ లెటర్లపై సంతకాలు జరగడంపై హర్షం ప్రకటించారు.