భార్యను కాల్చి.. తానూ కాల్చుకొని..

భార్యను కాల్చి.. తానూ కాల్చుకొని..

భారత సంతతి దంపతులు టెక్సాస్ లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఇంట్లోని బెడ్ రూంలో భార్యభర్తల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. మృతదేహాలపై బుల్లెట్ గాయాలు, క్రైం సీన్ ప్రాథమిక పరిశీలనలో.. భార్యను కాల్చి చంపి, భర్త కాల్చుకు ని చనిపోయినట్లు సందేహిస్తున్నారు. ఈ దంపతులను హైదరాబాద్ కు చెందిన నకిరేకంటి శ్రీనివాస్(51), నకిరేకంటి శాంతి(46) గా గుర్తించినట్లు చెప్పారు. అమెరికా టైం ప్రకారం సోమవారం తెల్లవారుజామున ఈ దారుణం చోటుచేసుకుందన్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు టెక్సాస్ యూనివర్సిటీలో చదువుకుంటుండగా.. పదహారేళ్ల కూతురు ఆదివారం రాత్రి ఇంట్లోనే, తన బెడ్ రూంలో ఉంది. సోమవారం ఉదయం ఎంత పిలిచినా తల్లిదండ్రులు బదులివ్వడంలేదంటూ కూతురు పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు బెడ్ రూం తలుపులను బలవంతంగా తెరిచి లోపలికి అడుగుపెట్టడంతో ఈ దారుణం తెలిసింది.

మృతదేహాల పక్కనే ఓ షార్ట్ గన్ పడి ఉంది. శ్రీనివాస్ టెక్సాస్ లోని ఓ కంపెనీలో డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, శాంతి సాఫ్ట్ వేర్ డెవలపర్ గా పనిచేస్తున్నారు. ఈ దంపతుల మధ్య ఎలాంటి గొడవలూ లేవని, ఇండియన్ సర్కిల్ లో అందరితోనూ స్నేహంగా ఉంటారని తమ విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. సోమవారం ఉదయం శ్రీనివాస్ నుంచి తమకో ఈమెయిల్ వచ్చిందంటూ ఆయన స్నేహితులు మీడియాకు వెల్లడించారు. వివరాలు బయటపెట్టొద్దని పోలీసులు ఆదేశించడంతో ఇతర వివరాలు చెప్పేందుకు వారు నిరాకరించారు.