ఇది వైసీపీ ఆడుతున్న మూడుముక్కలాట

ఇది వైసీపీ ఆడుతున్న మూడుముక్కలాట

మూడు రాజధానులను ఏర్పాటుచేస్తామంటున్న జగన్ ప్రభుత్వాన్ని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. మూడు రాజధానుల పేరుతో ఇది వైసీసీ ఆడుతున్న మూడు ముక్కలాట అని ఆయన మండిపడ్డారు. రాజధానిని మార్చొద్దంటూ రైతులు, మహిళలు, రైతుకూలీలు, కార్మికులకు సంఘీభావం తెలుపుతూ అమెరికాలోని న్యూజెర్సీ ప్రవాసాంధ్రుల ప్రతినిధులు చంద్రబాబును కలిశారు. అమరావతి పరిరక్షణ కోసం రూ. 7,76,022ల చెక్కును అందజేశారు. దీనికి సంబంధించి ఆయన కింది విధంగా ట్వీట్ చేశారు.

‘అమెరికాలోని న్యూజెర్సీ ప్రవాసాంధ్రుల ప్రతినిధులు నన్ను కలిసి, అమరావతి పరిరక్షణ జేఏసి తరఫున సేకరించిన ఎన్నారైల విరాళం రూ. 7,76,022ల చెక్కును అందజేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులు, మహిళలు, రైతుకూలీలు, కార్మికులకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులు కూడా ముందుకు రావడం ముదావహం.

అంతేకాదు లండన్, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ తదితర గల్ఫ్ దేశాల్లో కూడా ఎన్నారైలు రాజధాని రైతులకు సంఘీభావ ర్యాలీలు జరపడం అభినందనీయం. ఎందుకంటే ఇది ఏ కొందరి సమస్యో, ఒక ప్రాంతం సమస్యో కాదు. వైసీపీ ఆడుతున్న ఈ మూడు ముక్కలాట మొత్తం రాష్ట్రాన్నే అతలాకుతలం చేస్తుంది.

ఇప్పటికే వచ్చిన పెట్టుబడులు వెనక్కి పోయాయి. కంపెనీలన్నీ వేరే రాష్ట్రాలకు పోయాయి. కొత్త పెట్టుబడులు ఆగిపోయి, ఉపాధి కల్పనకు అడ్డుగోడ కట్టినట్టయ్యింది. తెదేపా అభివృద్ది అంతటినీ రివర్స్ చేశారు. ఈ పరిస్థితుల్లో రాజధాని అమరావతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత’అని ట్వీట్ చేశారు.

For More News..

తల్లిదండ్రుల్ని, తమ్మున్ని చంపిన మైనర్ బాలుడు

బర్త్‌డేకు పిలిచి.. గన్‌తో బెదిరించి..