
- రిజిస్టర్ అయిన మొత్తం ఇన్వెస్టర్ అకౌంట్లు 23.5 కోట్లు
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ)లో యూనిక్ ఇన్వెస్టర్ల సంఖ్య 12 కోట్ల మార్క్ను దాటింది. కేవలం ఎనిమిది నెలల్లోనే కొత్తగా కోటి మంది ఇన్వెస్టర్లు చేరారు. ‘‘ప్రతి నలుగురు ఇన్వెస్టర్లలో ఒకరు మహిళ ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో యూనిక్ ఇన్వెస్టర్ల సంఖ్య 11 కోట్ల మార్క్ను దాటింది”అని ఎన్ఎస్ఈ వివరించింది. కాగా, మొదటి కోటి మంది యూనిక్ ఇన్వెస్టర్లు చేరడానికి 14 ఏళ్లు పట్టింది. తర్వాతి కోటి మంది చేరేందుకు 7 సంవత్సరాలు, మూడవ కోటి చేరేందుకు 3.5 సంవత్సరాలు, నాలుగో కోటి చేరేందుకు కేవలం సంవత్సరమే మాత్రమే పట్టింది. మార్చి 2021 నాటికి 4 కోట్ల మార్క్ చేరడానికి 25 సంవత్సరాలు పట్టగా, తర్వాతి నుంచి కోటి మంది ఇన్వెస్టర్లు చేరుందుకు సగటున 6–7 నెలలు పట్టింది.
ఈ వేగవంతమైన వృద్ధికి డిజిటలైజేషన్, ఫిన్టెక్ సర్వీస్లు ఈజీగా అందుబాటులో ఉండడం, మధ్య తరగతి విస్తరణ, ప్రభుత్వ విధానాలు కారణమని ఎన్ఎస్ఈ పేర్కొంది. సెప్టెంబర్ 23, 2025 నాటికి ఎన్ఎస్ఈలో మొత్తం 23.5 కోట్ల ఇన్వెస్టర్ అకౌంట్లు నమోదయ్యాయి. ఇందులో ఒకటి కంటే ఎక్కువ బ్రోకరేజ్ల నుంచి రిజిస్టర్ అయిన అకౌంట్లు ఉన్నాయి. 12 కోట్ల యూనిక్ ఇన్వెస్టర్లలో సగటు వయస్సు 33 సంవత్సరాలు.
ఇది 5 సంవత్సరాల క్రితం 38 సంవత్సరాలుగా ఉండేది. వీరిలో 40 శాతం మంది 30 సంవత్సరాల లోపు వారు ఉన్నారు. దేశంలోని 99.85 శాతం పిన్కోడ్ల నుంచి ఈ యూనిక్ ఇన్వెస్టర్లు ఉన్నారని ఎన్ఎస్ఈ తెలిపింది. కిందటి నెల 31 నాటికి, మహారాష్ట్రలో 1.9 కోట్ల మంది యూనిక్ ఇన్వెస్టర్ల ఉన్నారు. ఉత్తరప్రదేశ్ 1.4 కోట్ల మందితో రెండో ప్లేస్లో, గుజరాత్ 1.03 కోట్ల మందితో మూడో ప్లేస్లో ఉన్నాయి. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 23 వరకు, నిఫ్టీ 50 ఇండెక్స్ 7 శాతం, నిఫ్టీ 500 ఇండెక్స్ 9.3 శాతం రిటర్న్ ఇచ్చింది.