
కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో ‘బింబిసార’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ఆగస్టు 5న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిన్న హైదరాబాద్లోని శిల్ప కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘రెండున్నరేళ్ల క్రితం ఈ కథ చెప్పాడు వశిష్ట్. అనుభవం లేదు కదా, ఇంత పెద్ద సినిమాని హ్యాండిల్ చేయగలడా అనిపించింది. కానీ సినిమా చూశాక.. ఎంత కసిగా కథ చెప్పాడో, అంతకంటే గొప్పగా మలిచాడనిపించింది. కథ, కథనం, ఏం జరగబోతోందో ముందే తెలిసినా.. చూసేటప్పుడు ఎంతో ఎక్సైట్మెంట్ ఫీలయ్యాను. ప్రేక్షకులూ అదే ఫీలవుతారు. తను భవిష్యత్తులో చేసే చిత్రాలకి ఇది ట్రైలర్ లాంటిది. ప్రేక్షకులకు నచ్చే వరకు, అభిమానులు కాలర్ ఎగరేసే వరకు సినిమాలు చేస్తూనే ఉంటానని ఇదే వేదికపై గతంలో చెప్పాను.
ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ ఎంతలా కాలర్ ఎగరేస్తారో మీరే చూస్తారు. ఆయన కెరీర్ గురించి ఈ సినిమాకి ముందు, దీని తర్వాత అని అంతా చెప్పుకుంటారు. ఆయన తప్ప మరెవరూ ఈ పాత్రకి న్యాయం చేయలేరు. ఎంతో కష్టపడి, ఒక నటుడిగా తనని తాను మలచుకుని నటించారు. కీరవాణి గారు ఈ చిత్రానికి బ్యాక్బోన్. ఇండస్ట్రీకి గడ్డుకాలం అంటున్నారు. థియేటర్కి జనాలు రావడం లేదంటున్నారు. ఇవన్నీ నేను నమ్మను. అద్భుతమైన సినిమా వస్తే చూసి ఆశీర్వదించే గొప్ప హృదయం తెలుగు ప్రేక్షకులది. ఈ చిత్రంతో పాటు అదే రోజు వస్తున్న ‘సీతారామం’ చిత్రాన్ని కూడా ఆదరించి, తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోయాలి. ఈ పరిశ్రమని పది కాలాలపాటు చల్లగా ఉంచాలని ప్రేక్షకుల్ని, ఆ దేవుణ్ని కోరుకుంటున్నాను’ అని చెప్పాడు.
కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘ఓ మంచి సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చేసిన ప్రయత్నమే ఈ చిత్రం. ఈసారి మాత్రం ఎవరినీ డిజప్పాయింట్ చేయను. హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తి చెందుతారు. ఈ ఏడాది మా తాతగారి వందో జయంతి. ఈ సినిమాను ఆయనకే అంకితమిస్తున్నాను. నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా థ్యాంక్స్’ అన్నాడు.
వశిష్ట్ మాట్లాడుతూ ‘టీజర్ని, ట్రైలర్ని, సాంగ్స్ని ఆదరించిన ప్రేక్షకులకు, నన్ను నమ్మి చాన్స్ ఇచ్చిన నిర్మాత హరికృష్ణ గారికి థ్యాంక్స్. కళ్యాణ్ రామ్ ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను’ అన్నాడు. ‘ఇలాంటి మంచి రోల్కి నన్ను సెలెక్ట్ చేసినందుకు డైరెక్టర్కి థ్యాంక్స్. కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు’ అని చెప్పింది కేథరీన్ థ్రెసా. ఇంత మంచి మూవీలో పార్ట్ కావడం గర్వంగా ఉందంది సంయుక్తా మీనన్. కీరవాణి, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, వైవా హర్ష, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.