- ఒమిక్రాన్ వ్యాప్తిని పరిగణలోకి తీసుకోండి
- ప్రభుత్వానికి డివిజన్ బెంచ్ సూచన
హైదరాబాద్, వెలుగు : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగనున్న నుమాయిష్ ఏర్పాటు చేసే ముందు దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తిని పరిగణించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్లైన్స్ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. జనం ఎక్కువగా గుమిగూడితే ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ తుకారాంజీల డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసే విషయంపై జీహెచ్ఎంసీ, ఫైర్సేఫ్టీ నుంచి పర్మిషన్ తీసుకున్నామని సొసైటీ ప్రెసిడెంట్ మెమో దాఖలు చేయగా.. ఏర్పాటుపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. 2019లో ఎగ్జిబిషన్లో అగ్ని ప్రమాదం జరగడం.. ఆ తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీ తీసుకున్న చర్యలను సవాల్ చేస్తూ లాయర్ ఖాజా ఐజూజుద్దీన్ పిల్ దాఖలు చేశారు. డివిజన్ బెంచ్ తదుపరి విచారణ జనవరి 4కి వాయిదా వేసింది.