
- మ. 3 నుంచి స్టార్ స్పోర్ట్స్లో
కొలంబో: ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో ఇండియా మెన్స్ టీమ్.. పాకిస్తాన్ను మూడుసార్లు మట్టి కరిపించి ఔరా అనిపించింది. ఇప్పుడు అమ్మాయిల జట్టుకు ఆ విజయ పరంపరను కొనసాగించే సమయం వచ్చింది. విమెన్స్ వన్డే వరల్డ్ కప్లో భాగంగా కొలంబో వేదికగా ఇండియా–పాకిస్తాన్ మధ్య ఆదివారం (అక్టోబర్ 05) హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
ఆసియా కప్లో పాక్ ప్లేయర్లకు సూర్యకుమార్ సేన షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఇరు జట్ల మధ్య రచ్చ మొదలవగా.. ఇండియా అమ్మాయిలు కూడా పాక్తో ‘నో హ్యాండ్షేక్’ ప్రొటోకాల్ను కొనసాగించనున్నారు. దాంతో ఆటేతర విషయాలు ఈ మ్యాచ్ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. దాయాదిపై ఘన రికార్డు ఉన్న హర్మన్ప్రీత్ కెప్టెన్సీలోని విమెన్స్ టీమ్ ఈ పోరులో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.
ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇరు దేశాల మహిళల జట్లు అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 27 సార్లు తలపడగా, ఇండియా 24 మ్యాచ్ల్లో గెలిచింది. వన్డే ఫార్మాట్లో అయితే పాక్తో ఆడిన 11 మ్యాచ్ల్లోనూ నెగ్గి 100 శాతం సక్సెస్ రికార్డుతో ఉంది. అదే జోరును ఇప్పుడు కూడా కొనసాగించాలని హర్మన్సేన భావిస్తోంది. తొలి వన్డేలో ఆల్రౌండర్ పెర్ఫామెన్స్తో శ్రీలంకపై గ్రాండ్ విక్టరీ సాధించిన మన టీమ్ ఫుల్జోష్లో ఉండగా.. బంగ్లాదేశ్ చేతిలో 7 వికెట్ల తేడాతో అనూహ్యంగా చిత్తయిన పాక్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ మ్యాచ్కు వాన ముప్పు పొంచి ఉండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది.
ఆస్ట్రేలియా- శ్రీలంక మ్యాచ్ వర్షార్పణం
ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య శనివారం (అక్టోబర్ 04) కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టాస్ కూడా సాధ్యం కాలేదు. దాంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.