
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితుల మధ్య కూడా ప్రధాన ఆఫీస్ స్థలాలకు గిరాకీ తగ్గడం లేదు. గత రెండున్నర సంవత్సరాల్లో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో ఆఫీస్ అద్దె 28 శాతం పెరిగిందని అనరాక్ తెలిపింది. వర్క్ఫ్రం హోమ్ విధానం చాలా వరకు తగ్గడంతో ఆఫీసులు కళకళలాడుతున్నాయి. అనరాక్ రిపోర్ట్ ప్రకారం.. ముంబైలో, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా కంపెనీలు పెద్ద ఎత్తున ఆఫీసులను లీజుకు తీసుకుంటున్నాయి.
ప్రీమియం, గ్రేడ్ ఎ ఆఫీస్ స్థలాల కోసం అమెరికన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో, సగటు నెలవారీ ఆఫీస్ అద్దె 2022లో చదరపు అడుగుకు రూ.131 నుంచి చదరపు అడుగుకు రూ.168 పెరిగింది. ఢిల్లీ-ఎన్సిఆర్లో అద్దె రూ.92 నుంచి రూ.110 లకు పెరిగింది. హైదరాబాద్ ఆఫీస్ అద్దె 24.1 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.58 నుంచి రూ.72 లకు పెరిగింది.