
- ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఎంపీఎస్వోలు
- గ్రౌండ్, సర్ఫేస్తోపాటు కొత్తగా ఆర్టిషియన్ వెల్స్
- యాప్ రూపకల్పన చేసిన కేంద్ర ప్రభుత్వం
- పక్కాగా సాగునీటి వనరుల వివరాలు
భద్రాచలం, వెలుగు : జిల్లాలో చిన్న తరహా నీటి వనరుల లెక్క తేల్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఐదేండ్లకు ఒకసారి జరిగే మైనర్ ఇరిగేషన్ సెన్సస్లో నిర్వహించే ఎంపీఎస్వో(మండల ప్రణాళిక గణాంకాధికారి)లకు ఇప్పటికే ట్రైనింగ్ఇచ్చారు. వీరి పర్యవేక్షణలో గ్రామ పంచాయతీ సెక్రటరీలు, ఏఈవోలు, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు సెన్సస్లో పాల్గొంటారు. చివరిసారిగా 2017–-18లో ఈ సెన్సస్చేపట్టారు.
ఈసారి సెన్సస్ గతానికంటే భిన్నంగా నిర్వహించనున్నారు. గ్రౌండ్, సర్ఫేస్ వాటర్తోపాటు ఊట బాబులను కూడా ఇందులో చేర్చారు. ఈసారి ఆధునిక సాంకేతికను జోడించి ప్రత్యేకమైన యాప్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూపొందించింది. లొకేషన్కు వెళ్లి యాప్లో పూర్తి వివరాలను అందులో పొందుపరుచుతారు. ఇకపై సాగునీటి వనరుల వివరాలు పక్కాగా లెక్కించడానికి ఇది దోహదపడుతుంది.
రెండు రకాలుగా సెన్సస్..
మైనర్ ఇరిగేషన్ సెన్సస్ రూరల్, అర్బన్ ప్రాంతాల్లో వేర్వేరుగా చేపడుతున్నారు. రూరల్ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ వాటర్గణన జరుగుతుంది. తక్కువ, మధ్యస్తం, ఎక్కువ లోతు గొట్టపు బావులను లెక్కిస్తారు. బోరు బావుల లెక్క పక్కాగా తయారు చేస్తారు. చెరువులు, ఎత్తిపోతలు వంటి సాగునీటి వనరుల సెన్సస్ జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రమే నీళ్లు ఉబికి వచ్చే ఊటబావులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ మినహా మిగిలిన అన్ని మండలాల్లో ఈ తరహా సెన్సస్ జరుగుతుంది. వ్యవసాయేతర పనులకు ఉపయోగించే సాగునీటి వనరులను కూడా లెక్కిస్తారు. చేపల చెరువులు, ప్రత్యేకంగా నీటి కోసమే తవ్విన చెరువులు, భూగర్భ జలాల పెంపు కోసం నిర్మించిన కుంటలు ఇందులోకి వస్తాయి.
గతానికి భిన్నంగా యాప్లో...!
గతంలో సెన్సస్అంటే కొన్ని ఫాంలను పట్టుకుని ఫీల్డ్ కు వెళ్లి అక్కడ ప్రశ్నలను అడిగి వివరాలు పొందుపరిచేవారు. కానీ ఈసారి గవర్నమెంట్ఆఫ్ఇండియా ప్రత్యేకంగా యాప్ రూపొందించి నీటి వనరులకు దగ్గరకు వెళ్లి వాటి వివరాలను నమోదు చేస్తారు. స్థానిక ఇరిగేషన్ ఇంజినీర్ల నుంచి అవసరమైన వివరాలు సేకరిస్తారు. వ్యవసాయ బోర్లు అయితే లోకేషన్, ఓనర్ పేరు, ఆయకట్టు, కులం, ఏ ఇయర్లో బోరు తవ్వారు.?, ఎంత ఖర్చు అయ్యింది..? వాటికి అవసరమైన ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకున్నారు..? బోరు లోతు, వెడల్పు(డయామీటర్)..? బోరుకు ఉపయోగించే పవర్ డిటైల్స్ సేకరించాలి.
ఇక సర్ఫేస్ అయితే చెరువులు గురించి ఇరిగేషన్ ఇంజినీర్ల ద్వారా వివరాలు తీసుకుంటారు. లోకేషన్, సర్వే నంబర్, చెరువు ఎప్పుడు తొవ్వారు, సహజంగా ఏర్పడిందా.? తొవ్వారా..? ఖర్చు ఎంత అయ్యింది? చెరువు నీటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.? కాల్వలు, కెనాల్స్, ఆయిల్, కరెంట్ మోటార్లు వినియోగిస్తున్నారా..? వంటి వివరాలు తీసుకుంటారు. జిల్లాలో 700 చెరువులు, 1413 కుంటలు, 124 లిఫ్ట్స్, 28,123 వ్యవసాయ బోర్లు ఉన్నాయి.
త్వరలో సెన్సస్
7వ మైనర్ ఇరిగేషన్సెన్సస్ త్వరలో ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన ట్రైనింగ్ అధికారులకు నెల రోజుల క్రితమే ఇచ్చారు. ఐదేండ్లకు ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సర్వే నిర్వహిస్తుంది. ఈసారి పేపర్పై కాకుండా యాప్ ద్వారా మాత్రమే సెన్సస్జరుగుతుంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే సెన్సస్ ప్రారంభిస్తాం. -- వెంకటేశ్వరరావు, మాస్టర్ ట్రైనీ