జీసీసీ బిజినెస్​ డౌన్​.. అటవీ ఉత్పత్తుల సేకరణకు ఆటంకాలు

జీసీసీ బిజినెస్​ డౌన్​.. అటవీ ఉత్పత్తుల సేకరణకు ఆటంకాలు
  • 2024–25లో రూ.191.72కోట్ల లక్ష్యం.. రూ.113.79కోట్లు మాత్రమే సాధించింది
  • 2025–26కి చేసిన రూ.150కోట్ల వార్షిక ప్రణాళిక నేటికీ ఆమోదం పొందలే.. 
  • కాంట్రాక్టర్లు, డీలర్లు రాకపోవడంతో నిలుస్తున్న అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు
  • జీసీసీకి శాపంగా మారుతున్న ఆపరేషన్​కగార్ ఉద్రిక్తత, ఉత్పత్తులకు తగ్గుతున్న గిరాకీ
  • అటవీ ఉత్పత్తుల సేకరణ, బిజినెస్​పెంపుపై దృష్టి పెడతామంటున్న అధికారులు

భద్రాచలం, వెలుగు :  అడవుల జిల్లా భద్రాద్రికొత్తగూడెంలో జీసీసీ(గిరిజన సహకార సంస్థ)  ప్రభ రోజు రోజుకు మసకబారుతోంది. ఒకవైపు లక్ష్యాలు సాధించడానికి ఆపసోపాలు పడుతున్నది. గతేడాది 2024–-25లో రూ.191.72కోట్ల లక్ష్యానికి కేవలం రూ.113.79కోట్లు  మాత్రమే సాధించింది. అటవీ ఉత్పత్తుల సేకరణ దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో 2025-–26 ఆర్థిక సంవత్సరానికి తయారు చేసిన రూ.150కోట్ల వార్షిక ప్రణాళిక నేటికీ ఆమోదం పొందలేదు. మార్చి 31 నాటికి ఆర్థిక సంవత్సరం పూర్తవుతుంది. కొత్త సంవత్సరం ప్రణాళిక ఏప్రిల్​ నుంచే మొదలు కావాలి. కానీ జీసీసీ కార్యాలయంలోనే రెండు నెలలుగా మూలుగుతోంది. 

బిజినెస్​లేక దిగాలు..

అటవీ ఉత్పత్తుల్లో ప్రధానమైనది జిగురు.  జిగురు కొనుగోలే జీసీసీకి ప్రధాన ఆదాయ వనరు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి జిగురును తీసుకునేందుకు కాంట్రాక్టర్లు, డీలర్లు రాకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. కోట్ల రూపాయల విలువ చేసే జిగురు గోడౌన్లల్లో మూలుగుతోంది. ముష్టిగింజలు, చిల్లగింజలు, విప్పపువ్వు, ఉసిరి, ఎండు ఉసిరి పప్పు, గచ్చకాయలు, కానుగ గింజలు, చింతపండు, కుంకుడుకాయలు, తేనె, కరక్కాయలు, ఆడవి చీపుర్లు, నల్లజీడి గింజలు, నరమామిడి చెక్క లాంటి వాటిని గిరిపుత్రులు అడవుల నుంచి సేకరిస్తుంటారు. వాటిని జీసీసీకి తీసుకొచ్చి అమ్ముతుంటారు. 

ఉపాధి హామీ పథకం, దండకారణ్యంలో ఆపరేషన్​ కగార్​ వల్ల ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్​లో కొన్ని ఉత్పత్తులకు గిరాకీ లేకపోవడం లాంటి కారణాలు జీసీసీకి శాపంగా మారింది. విచ్చలవిడిగా అడవులు నరికివేతకు గురై ఉసిరి, నరమామిడిచెట్లు అంతరించిపోయాయి. రాష్ట్ర విభజన వల్ల అటవీ ఉత్పత్తులు వచ్చే మండలాలు ఆంధ్రాలో విలీనం కావడం కూడా తెలంగాణ జీసీసీకి శరాఘాతమైంది. జిల్లాలోని ఐటీడీఏ పరిధిలోని గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు నిత్యావసర సరుకులు సరఫరా చేయడం ద్వారా కొంత ఆదాయాన్ని జీసీసీ పొందుతోంది. స్టూడెంట్లకు కాస్మోటిక్స్ కూడా జీసీసీనే ఇస్తోంది. కానీ ఇటీవల గిరిజన సంక్షేమశాఖ తీసుకున్న ఒక నిర్ణయం కూడా జీసీసీ వ్యాపారానికి దెబ్బకొట్టింది. కాస్మోటిక్స్ నిధులు నేరుగా స్టూడెంట్ల ఖాతాలోకే వేస్తూ జీవో వచ్చింది. ఇవన్నీ ప్రతికూలంగా మారడంతో జీసీసీ భవితవ్యం గందరగోళంగా మారింది. 

అనేక అనుమానాలు.. 

జీసీసీలో అసలేం జరుగుతోందన్న చర్చ ప్రస్తుతం జరగుతున్నది.  రెండు నెలలు దాటినా కొత్త వార్షిక ప్రణాళికకు ఆమోదం రాకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో భద్రాచలం జీసీసీ డివిజన్​ పరిధిలో దమ్మపేట, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు , ఇల్లెందు బ్రాంచిల్లో బిజినెస్​ పెంపొందించేందుకు చేస్తున్న కసరత్తులో భాగంగానే ఆలస్యం అవుతుందని జీసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఒక కన్సల్టెన్సీకి అప్పగించి జీసీసీ చేపట్టాల్సిన బిజినెస్ గురించి ఒక ప్లాన్​ తయారు చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. మసకబారుతున్న జీసీసీని పట్టాలెక్కించేందుకు యాక్షన్​ ప్లాన్​ సిద్ధం చేస్తున్నందునే వార్షిక ప్రణాళికను ఆపినట్లుగా చర్చ నడుస్తోంది. 

అటవీ ఉత్పత్తుల సేకరణపై దృష్టి

సిబ్బంది సహకారంతో అటవీ ఉత్పత్తుల సేకరణ, బిజినెస్​ పెంపుపై దృష్టిసారించాం. వార్షిక ప్రణాళికను ఆమోదం కోసం హెడ్డాఫీస్​కు పంపించాం. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం బిజినెస్​ వృద్ధికి పనిచేస్తాం. ఆలస్యానికి కారణం తెలియదు. కానీ లక్ష్యాలను కచ్చితంగా అందుకుంటాం. గిరిజనులకు ఉపాధి కల్పిస్తాం. – సమ్మయ్య, జీసీసీ డీఎం