
- కాళేశ్వరంపై ప్రభుత్వ పెద్దల నిర్ణయాన్నే అమలు చేశామన్న అధికారులు
- వాళ్లు చెప్పినట్టు చేశామని కమిషన్కు స్టేట్మెంట్లు
- అధికారులే చేశారంటూ లీడర్ల స్టేట్మెంట్లు
- కమిషన్ రిపోర్టుపై సర్వత్రా ఆసక్తి
- అధికారులపైనే చర్యలా.. లీడర్లపైనా సిఫార్సులుంటాయా అని చర్చ
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలపై అధికారులు వర్సెస్ లీడర్లు అన్నట్టుగా వ్యవహారం మారింది. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఇటీవలే ముగ్గురు ప్రజాప్రతినిధుల విచారణను పూర్తి చేసింది. తొలుత ఈటల రాజేందర్, ఆ తర్వాత హరీశ్ రావు, కేసీఆర్ నుంచి వాంగ్మూలాలను నమోదు చేసింది.
అధికారులు, ప్రజాప్రతినిధులు కలిపి మొత్తంగా 115 మందిని కమిషన్ విచారించింది. ఇప్పుడు అందరి దృష్టి కమిషన్ ఇచ్చే రిపోర్టుపైనే పడింది. ఇప్పటికే అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లతో రిపోర్టును రాసిన కమిషన్.. తాజాగా ప్రజాప్రతినిధుల స్టేట్మెంట్ల ఆధారంగా రిపోర్టులో అంశాలను చేర్చనుంది. పలు మార్పులూ చేస్తే చేయొచ్చన్న అంచనాలున్నాయి.
విచారణలో భాగంగా పలువురు అధికారులు తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న అంచనాకు కమిషన్ వచ్చినట్టు చెబుతున్నారు. వారిపై చర్యలను సిఫార్సు చేసే అవకాశమూ ఉందంటున్నారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులపైనా చర్యలకు కమిషన్ సిఫార్సు చేస్తుందా.. లేదా అన్న దానిపై ఆసక్తి నెలకొంది.
ఒకరిపై ఒకరు..
కమిషన్ విచారణలో భాగంగా చాలా వరకు డెసిషన్లు ఆనాటి ప్రభుత్వ పెద్దలే తీసుకున్నారని అధికారులంతా కుండబద్దలు కొట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు విధానపరమైన నిర్ణయాలు, ఆర్థికావసరాలు, టెండర్ల వంటివన్నీ ఆనాటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే జరిగాయని కమిషన్కు స్పష్టంగా చెప్పారు.
ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్ల మార్పుతో పాటు మూడు బ్యారేజీల్లో నీటి స్టోరేజ్ ప్రభుత్వ పెద్దల నిర్ణయమేనని తేల్చి చెప్పారు. కానీ, ఇటీవల విచారణకు హాజరైన హరీశ్ రావు, కేసీఆర్లు మాత్రం.. సాంకేతిక నిర్ణయాలన్నీ ఇంజినీర్లే తీసుకున్నారంటూ ప్లేటు ఫిరాయించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మెదడును కరిగించి.. రక్తాన్ని రంగరించి పనిచేశానంటూ గతంలో సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఓ ప్రెస్మీట్లో బహిరంగంగానే చెప్పారు. కానీ, ఇప్పుడు విచారణలో మాత్రం ప్రాజెక్టు నిర్మించాలనుకునే నిర్ణయం తప్ప.. టెక్నికల్ అంశాలన్నింటినీ అధికారులే చూసుకున్నారంటూ కమిషన్కు స్టేట్మెంట్ ఇచ్చారు.
ఇప్పటికే ఓ అంచనాకు..
అధికారుల స్టేట్మెంట్ల ప్రకారం కమిషన్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చి రిపోర్టును సిద్ధం చేసి పెట్టింది. ఇప్పుడు దానికి అదనంగా కేసీఆర్, హరీశ్, ఈటల వాంగ్మూలాలతో రిపోర్టుకు చేర్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కమిషన్ ఎలాంటి సిఫార్సులు చేస్తుందన్నదానిపై అధికార వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి ఏర్పడింది.
అయితే, ప్రజాప్రతినిధుల స్టేట్మెంట్లతో పలువురు అధికారులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎప్పుడైనా ప్రభుత్వం చెప్పిన విధంగానే ముందుకు వెళ్లామని, ఇప్పుడేమో వాళ్ల తప్పేమీ లేనట్టుగా తమపైనే నిందలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.