శామీర్ పేట, వెలుగు: రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఆరోపణలు రావడంతో.. తల్లిదండ్రులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్లో జరుగుతున్న పరిణామాలపై కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమ పిల్లలతో మాట్లాడడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు.
మీడియాలో చూసి సమాచారం తెలుసుకొని తమ పిల్లలతో మాట్లాడేందుకు వచ్చామని వాపోయారు. నాలుగు రోజులుగా ఫోన్లలో కూడా మాట్లాడడం లేదని స్కూల్ దగ్గరికి వస్తే లోపలికి పంపడం లేదన్నారు. తమ పిల్లల భవిష్యత్ పై ప్రభావం పడకుండా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు.