రూ. 2,400 కోట్ల పెట్టుబడి.. 10 వేల మందికి ఉద్యోగ అవకాశం
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వంతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని క్యాబ్ సర్వీసెస్ కంపెనీ ఓలా పేర్కొంది. ఈ ప్లాంట్ కోసం రూ. 2,400 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నామని తెలిపింది. ఈ ప్లాంట్ ద్వారా మొత్తం 10 వేల మందికి ఉద్యోగాలొస్తాయని ఓలా పేర్కొంది. ప్లాంట్ కెపాసిటీ ఏడాదికి 20 లక్షల యూనిట్లని తెలిపింది. ‘ప్రధాని ఆత్మనిర్భర్ భారత్ విజన్కు ఈ ప్లాంట్ గొప్ప ముందడుగు. ఎలక్ట్రిక్ వెహికల్స్ సెక్టార్లలో దిగుమతులపై ఆధారపడడాన్ని ఈ ప్లాంట్ తగ్గిస్తుంది’ అని పేర్కొంది. యునిక్ స్కిల్స్ ఉండడం, మ్యాన్ పవర్, భౌగోళిక పరిస్థితుల వలన ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి గ్లోబల్ హబ్గా ఇండియా నిలుస్తుందని అభిప్రాయపడింది. కేవలం ఇండియన్ మార్కెట్కే కాకుండా, యూరప్, ఆసియా, లాటిన్ అమెరికా వంటి మార్కెట్లలో కూడా కంపెనీ తన స్కూటర్లను లాంచ్ చేయనుంది. రానున్న కొన్ని నెలల్లో మరిన్ని మోడల్స్ను లాంచ్ చేయాలని ఓలాచూస్తోంది. ఏడాదిలోపే ఈ ప్లాంట్ను అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్స్ వేసుకొంది. త్వరలో న్యూజిలాండ్లో తమ స్కూటర్లను లాంచ్ చేస్తామని ఓలా ప్రకటించింది. వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ను తయారు చేసి ఇండియా స్కిల్స్ను గ్లోబల్ మార్కెట్లకు ఈ ప్లాంట్ చూపుతుందని ఓలా చైర్మన్ భావిష్ అగర్వాల్ అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఎలక్ట్రిక్ బిజినెస్ కోసం 2వేల మందిని నియమించుకుంటామని కంపెనీ ప్రకటించింది.