ఒకరి బదులు మరొకరి పెన్షన్తొలగింపు
అధికారులను నిలదీసిన కుటుంబీకులు
గంగాధర, వెలుగు: బతికున్న వృద్ధురాలిని అధికారులు రికార్డుల్లో చంపేశారు. పెన్షన్ ఆగిపోవడంతో కుటుంబీకులు ఆరా తీయగా విషయం
వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన ఇరుగురాల పోచమ్మ అనే వృద్ధురాలికి పెన్షన్సొమ్మే ఆసరా. ఎప్పటిలాగే పెన్షన్ డబ్బు తీసుకుందామని ఇటీవల బ్యాంకుకు వెళ్లిన ఆమెకు డబ్బులు పడలేదని తెలిసింది. దీంతో తోటివారిని అడిగింది. వారికి డబ్బులు వచ్చాయని చెప్పడంతో ఆమె కుటుంబసభ్యులు బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి వాకబు చేశారు. ఆమె ఆధార్ కార్డు ద్వారా ఆసరా వెబ్సైట్లో పరిశీలించగా చనిపోయినట్లుగా నమోదు చేసి ఉంది. పోచమ్మ బతికుండగానే చనిపోయినట్లుగా చూపి తన పెన్షన్ఎలా నిలిపివేస్తారని కుటుంబసభ్యులు కార్యదర్శి, ఎంపీడీవోను నిలదీశారు. కార్యదర్శిని ఎంపీడీవో అడగగా అదే పేరుతో మరో మహిళ ఉందని, భర్త పేరు మాత్రం వేరని తెలిపాడు. ఆమె బదులు పొరపాటున ఈమె పేరు డిలీట్అయ్యిందని చెప్పాడు. కార్యదర్శి పొరపాటుతో పోచమ్మకు పెన్షన్ఆగిపోయిందని, విషయాన్ని ఆర్డీవోకు వివరించి పెన్షన్ పునరుద్ధరిస్తామని ఎంపీడీవో వృద్ధురాలి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. తనకు రెండు నెలల పెన్షన్ రావాల్సి ఉందని, పెన్షన్ నిలిపివేతపై విచారణ జరిపి న్యాయం చేయాలని పోచమ్మ కోరుతోంది.