- ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఉప్పల్, వెలుగు: పాత నేరస్తుడు జడ్జిగా అవతారమెత్తి భూసెటిల్ మెంట్లు చేస్తూ పోలీసులకు చిక్కాడు. అతనితో పాటు మాజీ సైనికుడిని అరెస్టు చేసి ఒక పిస్తల్, ఐదు రౌండ్ల బులెట్లు, రెండు పిస్టల్ మ్యాగజైన్లు, రూ.7500 నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ పీఎస్ లో శుక్రవారం మల్కాజిగిరి డీసీపీ జానకి మీడియాకు వివరాలు తెలిపారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల జిల్లాకు చెందిన నామాల నరేందర్రెడ్డి (31) ఉపాధి కోసం సిటీకి వచ్చి రామంతాపూర్ భరత్ నగర్లో ఉంటూ రియల్ఎస్టేట్ చేసేవాడు.
వచ్చే సంపాదన సరిపోక చోరీలు చేస్తూ అరెస్ట్ అయి పలుమార్లు జైలుకు వెళ్లాడు. 2018లో విడుదలైన నరేందర్రెడ్డి ఖమ్మంలో అసిస్టెంట్ జిల్లా జడ్జినంటూ భూ వివాదాల కేసులను పరిష్కరిస్తానంటూ అమాయకుల వద్ద డబ్బులు తీసుకుని మోసగించి జైలు వెళ్లి బయటకు వచ్చాడు. అమీర్పేట్లో ఉండే వెబ్ డిజైనర్ సంతోష్ను కలిసి తెలంగాణ హైకోర్టు అడిషనల్ సివిల్ జడ్జి పేరుతో ఫేక్ప్రొఫైల్ తయారు చేయించాడు.
మాజీ సైనికు డు చిక్కం మధుసూదన్రెడ్డి(41)ని గన్మెన్ గా నియమించుకుని నరేందర్ రెడ్డి భూ దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నాడు. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన గార్లపాటి సోమిరెడ్డికి చెందిన మహబూబాబాద్ జిల్లా ఖానాపూర్లోని భూమి ముటేషన్ క్లియర్ చేసేందుకు రూ.10లక్షలు తీసుకుని తిప్పించుకుంటున్నాడు. మోసపోయానని గుర్తించిన బాధితుడు సోమిరెడ్డి ఫిర్యాదు చేయగా ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్ఓటీ పోలీసులు నరేందర్రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ జడ్జిగా తేలింది. అతనితో పాటు గన్ మెన్ మధుసూదన్రెడ్డిని అరెస్టు చేశారు.