హైదరాబాద్ : ఆన్ డిమాండ్ వర్క్ స్పేస్ ప్రొవైడర్ గోఫ్లోటర్స్ హైదరాబాద్లోకి అడుగుపెడుతోంది. కో వర్కింగ్ స్పేస్ కంపెనీలాగా ప్రతి నగరంలో పెద్ద పెద్ద సెంటర్లను ఏర్పాటు చేయకుండా.. కొద్ది మంది పార్టనర్లతో కలిసి చిన్న చిన్న ఆఫీసులు ఏర్పాటు చేస్తుంది. దీని వల్ల యూజర్లు ఏ రోజైనా, ఎక్కడ నుంచైనా తమ అవసరానికి అనుగుణంగా పనిచేసుకునేందుకు సాయ పడుతుంది. రెగ్యులర్ వర్క్, మీటింగ్ లేదా వీడియో కాన్ఫరెన్స్ వంటి వాటి కోసం వర్క్ స్పేస్లను అందిస్తుంది. మార్చి నుంచి హైదరాబాద్లోని పార్టనర్లతో గోఫ్లోటర్స్ సంప్రదింపులు జరుపుతూ ఉంది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, దిల్సుఖ్నగర్ వంటి ప్రాంతాల్లో కంపెనీ తన సెంటర్లను ఏర్పాటు చేయాలని చూస్తోంది. హైదరాబాద్లోని 8 నుంచి 9 లొకేషన్లలో 30 పార్టనర్లతో ఇప్పటికే గోఫ్లోటర్స్ భాగస్వామ్యం కుదుర్చుకుందని తెలిసింది. స్పేస్ సొంతదారులు లేదా కిరాయికి ఇచ్చే వ్యక్తులు, స్పేస్ను మేనేజ్ చేసే వాళ్లు పార్టనర్లుగా ఉండొచ్చు. ఇప్పటికే చెన్నై, బెంగళూరు, కోయంబత్తూర్లలో 110కు పైగా స్పేస్లలో ఆన్ డిమాండ్ వర్క్స్పేసెస్ను ఆఫర్ చేస్తున్నట్టు కంపెనీ కో ఫౌండర్ శ్యామ్ సుందర్ నాగరాజన్ చెప్పారు. 300కు పైగా సీట్ల సామర్థ్యంతో కంపెనీ హైదరాబాద్లో తన కార్యకలాపాలు ప్రారంభించాలనుకుంటోంది. ఇప్పుడున్న సిటీల్లో 800 సీట్ల సామర్థ్యం ఉంది. స్టార్టప్లు విపరీతంగా పెరుగుతుండటంతో, క్వాలిటీ, అఫర్డబుల్ వర్క్స్పేస్లను అందుబాటులోకి తీసుకు రావాలని చూస్తున్నామని చెప్పారు. ఇండియాలో నాన్ మెట్రో నగరాల్లో ఉన్నఅవకాశాలను అందిపుచ్చుకోవాలని కంపెనీ ప్లాన్లో ఉంది. ఇండియాలో టెక్నాలజీ స్పేస్లో ఫ్రీలాన్సర్లు పెరుగుతున్నారని, దీంతో అదనపు డిమాండ్ వస్తోందని గోఫ్లోటర్స్ కో ఫౌండర్ శ్రీవాత్సన్ పద్మనాభన్ చెప్పారు.