సమగ్ర భూసర్వేకు దేశంలో చాలా కంపెనీలు, ప్రైవేట్ ఏజెన్సీలు సిద్ధంగా ఉన్నాయని, తలా ఓ జిల్లా ఇస్తే తొందరగా చేసి పెడతామంటున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. సర్వే చేసిన తర్వాత పొజిషన్ మీద ఎక్కువ ఉందో.. తక్కువ ఉందో తేలిపోతుందని, ఆ తర్వాత పట్టాలో ఎక్కువ, తక్కువ ఉంటే మార్చుకోవచ్చన్నారు. సమగ్ర భూసర్వేతోనే 99 శాతం సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. సమగ్ర సర్వేలో అక్షాంశాలు, రేఖాంశాల వారీగా కోఆర్డినేట్స్ ఇస్తారని, ఒక్కసారి హద్దులు నిర్ధారిస్తే భూగోళం ఉన్నంత వరకు మార్చడానికి వీలుండదన్నారు. వీలైనంత తొందరగా సర్వే జరుగుతదని, ప్రతి సర్వే నంబర్కు కో ఆర్డినేట్స్ ఇస్తామని వెల్లడించారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తామన్నారు. అసైన్డ్ ల్యాండ్ విషయంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రులు పార్టీలకతీతంగా దళిత, గిరిజన నేతలు, ఎమ్మెల్యేలను పిలిచి సమావేశం పెట్టాలని సూచించానని ఆయన వివరించారు.
