యువకుల అత్యుత్సాహమే షాద్ నగర్ కరోనా వైరస్ కేసులకు కారణమని తెలుస్తోంది. మొన్నటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న షాద్ నగర్ పట్టణంలో ఉన్నట్టుండి కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. దీనికి ప్రధాన కారణం యువకులేనని తెలుస్తోంది. కరోనా కారణంగా బయట తిరగొద్దని అధికారులు చెప్పినా వినిపించుకోలేదు. వారు చేసిన తప్పిదమే ఇప్పుడు మొత్తం షాద్ నగర్ ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నట్లు సమాచారం.
పట్టణంలో విజయనగర్ కాలనికి చెందిన ఓ యువకుడికి కరోనా సోకింది. బాధితుడు అతని స్నేహితుడు ఇద్దరు కలిసి హైదరాబాద్ రెడ్ జోన్ లో ఉన్న జియా గుడా లో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అనంతరం అతనికి ఆస్తమా లక్షణాలు బయటపడ్డాయి. ఇదే యువకుడు పట్టణంలో విజయనగర్ కాలనీకి చెందిన యువకుడితో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో అతనికి కూడా ముందుగా కరోనా పాజిటివ్ తేలింది. ఈ వ్యవహారంలో ఈశ్వర్ కాలనీకి చెందిన యువకుడు పాజిటివ్ సోకినప్పటికి అలాగే తెలియక బయట తిరిగాడు. ప్రస్తుతం ఇదే వ్యక్తికి సంబంధించిన జియాగుడా నివాసి అమ్మమ్మ తిలోత్తమకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
ప్రస్తుతం ఈ యువకులతో సన్నిహితంగా మెలిగిన మరికొందరు స్నేహితులు నేరుగా వైద్య శాఖకు ఫోన్లు చేసి వారితో సన్నిహితంగా ఉన్నాము తమకు ఏమీ కాకుండా చూడండి అంటూ ఫోన్లలో అధికారుల్ని కోరుతున్నారు. వారిలో కొంతమంది అత్యవసర చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.