హైదరాబాద్: బాలకృష్ణ, బోయపాటి శీను కాంబోలో వస్తున్న సినిమా అఖండ–2. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. అఖండ–2 ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం జరగనుంది. నవంబర్ 28,2025న కైతలాపూర్ గ్రౌండ్, కూకట్పల్లిలో నిర్వహిస్తున్నారు. దీంతో.. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా జన సమ్మర్థం, ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో.. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ను సజావుగా కొనసాగించేందుకు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) జారీ చేసిన ప్రకటనలో, కూకట్పల్లి కైతలాపూర్ ప్రాంతాల్లో ఈవెంట్ సమయంలో ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉంటాయని వెల్లడించారు.
ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు:
1. మూసాపేట్ ఎంట్రన్స్:
భరత్నగర్, ఎర్రగడ్డ నుంచి GHMC ఆఫీస్ వైపు ముసాపేట్ ద్వారా వచ్చే వాహనాలు → కూకట్పల్లి Y జంక్షన్కు మళ్లింపు.
సమయం: సా. 4 నుండి రా. 11 గంటల వరకు
2. అశోకా వన్ మాల్, కూకట్పల్లి:
కూకట్పల్లి Y జంక్షన్ నుంచి IDL లేక్ వైపు వెళ్లే వాహనాలు → JNTU మార్గానికి మళ్లింపు.
సమయం: సా. 4 నుండి రా. 11 గంటల వరకు
3. యశోద హాస్పిటల్, మాదాపూర్:
మాదాపూర్, హైటెక్ సిటీ నుంచి కైతలాపూర్ వైపు వచ్చే వాహనాలు → నెక్సస్ మాల్, JNTU రోడ్ వైపు మళ్లింపు.
సమయం: సా. 4 నుండి రా. 11 గంటల వరకు
ఇందుకు తగ్గట్టుగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని, ట్రాఫిక్ సిబ్బందితో సహకరించాలని కోరారు.
