న్యూఢిల్లీ: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మెగా వేలంలో సంచలనం నమోదైంది. టీమిండియా మహిళా స్టార్ బ్యాటర్ ప్రతీకా రావల్ వేలంలో అన్ సోల్డ్గా మిగిలిపోయింది. రూ.10 లక్షల బేస్ ప్రైజ్తో ఆక్షన్లో వచ్చిన ప్రతీకా రావల్ను ఏ ఫ్రాంచైజ్ కొనుగోలు చేయలేదు. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2025లో అద్భుతంగా రాణించిన ప్రతీకాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించకపోవడం గమనార్హం.
అయితే.. డబ్ల్యూపీఎల్ ఆక్షన్లో ప్రతీకా అన్ సోల్డ్గా మిగిలిపోవడానికి ప్రధాన కారణం ఆమె గాయమేనని తెలుస్తోంది. వరల్డ్ కప్లో ఫీల్డింగ్ చేస్తూ ఈ ఇండియా ఓపెనర్ గాయపడిన విషయం తెలిసిందే. కాలికి తీవ్రమైన గాయంతో కావడంతో టోర్నీ మధ్యలోనే ప్రతీకా నిష్క్రమించింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం, ఆమె పూర్తిగా కోలుకునేసరికి సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో ప్రతీకాను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఇంట్రెస్ట్ చూపించలేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వన్డే వరల్డ్ కప్లో భాగంగా 2025, అక్టోబర్ 26న నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచులో ఫీల్డింగ్ చేస్తూ ప్రతీకా రావల్ గాయపడింది. బౌండరీ వెళ్తున్న బంతిని ఆపబోయే క్రమంలో ఆమె కాలుకు తీవ్ర గాయమైంది. దీంతో గ్రౌండ్లోనే నొప్పితో ప్రతీకా విలవిలలాడింది.
టోర్నీలో అద్భుతంగా రాణించినప్పటికీ గాయం కారణంగా కీలకమైన నాకౌట్ మ్యాచులకు దూరమైంది. వరల్డ్ కప్లో మొత్తం 7 మ్యాచ్లాడిన ఈ టీమిండియా ఓపెనర్ 51.33 యావరేజ్ తో 308 పరుగులు చేసింది. న్యూజిలాండ్తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో సెంచరీ చేసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. కానీ గాయం కారణంగా మధ్యలోనే టోర్నీ నుంచి వైదొలిగింది.
