- పురానాపూల్లో రూ.10 లక్షలు స్వాధీనం
మెహిదీపట్నం, వెలుగు: సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ. కోటిన్నర నగదును తనిఖీల్లో భాగంగా మంగళహాట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సౌత్ అండ్ వెస్ట్ జోన్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపిన ప్రకారం.. దారుస్సలాం చౌరస్తాలోని ఓల్గా హోటల్ సమీపంలో మంగళవారం రాత్రి పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ జీప్ ను ఆపి చూడగా రూ. కోటిన్నర నగదు కనిపించింది.
సరైన పత్రాలు చూపకపోవడంతో ఆ నగదును సీజ్ చేశామని డీసీపీ తెలిపారు. అలాగే కుల్సుంపురా పోలీసులు పురానాపూల్ వద్ద మంగళవారం సాయంత్రం రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వాహనాలు తనిఖీల్లో భాగంగా అటు వైపు వెళ్తున్న ఓ కారును ఆపి సోదాలు చేయగా రూ.10 లక్షల నగదు దొరికింది. ఆ డబ్బుకు లెక్కాపత్రాలు లేకపోవడంతో సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.