
ఖైరతాబాద్, వెలుగు: లిక్విడ్ క్యాష్ఇస్తే ఆన్ లైన్ లో ఆ అమౌంట్ను ట్రాన్స్ ఫర్ చేస్తానని చెప్పి ఓ వ్యక్తి దగ్గరి నుంచి డబ్బులు తీసుకుని పరారైన నిందితుడిని ఎస్ ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ గోదావరి జిల్లా రాజోలుకు చెందిన ఇంటిపల్లి రామారావు(27) కేపీహెచ్ బీకాలనీలోని వేద లగ్జరీ బాయ్స్ హాస్టల్ లో ఉంటున్నాడు. ముషీరాబాద్లో ఉండే గౌతమ్ కృష్ణ ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. ఈ నెల 7న రూ.లక్ష డిపాజిట్ చేసేందుకు గౌతమ్ ఎస్ఆర్ నగర్లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం సెంటర్కు వెళ్లాడు. అదే టైమ్లో అక్కడికి వచ్చిన రామారావు రూ.లక్ష లిక్విడ్ క్యాష్ ఇస్తే ఆన్ లైన్లో ఆ డబ్బును ట్రాన్స్ ఫర్ చేస్తానని గౌతమ్ను నమ్మించాడు. గౌతమ్ నుంచి డబ్బు తీసుకున్న రామారావు రూ.లక్ష ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఫేక్ మెసేజ్ను అతడి మొబైల్కి పంపి పరారయ్యాడు. అమౌంట్ తన అకౌంట్లో క్రెడిట్ కాలేదని గుర్తించిన గౌతమ్ మోసపోయినట్లు తెలుసుకుని ఈ నెల 12న ఎస్ఆర్ నగర్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రామారావును సోమవారం అరెస్ట్ చేశారు. అతడి దగ్గరి నుంచి రూ.95 వేల క్యాష్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ రామారావు ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాచుపల్లి, చందానగర్, కేపీహెచ్బీ పీఎస్ల పరిధిలో ఇతడిపై కేసులున్నాయన్నారు.