మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులను కాపాడుతూ ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తన ప్రమేయం లేకుండా తన ఫోటోలను , వాయిస్ ను దుర్వినియోగం చేస్తూ.. తన హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారంటూ ఎన్టీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఈ కేసును విచారించిన కోర్టు తారక్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఎన్టీఆర్ ఒక అంతర్జాతీయ సెలబ్రిటీ అని, ఆయన పేరు మీద ఆయనకు మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది.
అసలేం జరిగింది?
ఇటీవలి కాలంలో ఎన్టీఆర్ పేరును, ఆయన ఫోటోలను, వాయిస్ను కొందరు వ్యక్తులు, సంస్థలు అనధికారికంగా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. టీ-షర్టులు, పోస్టర్లు, సోషల్ మీడియా ప్రకటనలు, చివరకు కృత్రిమ మేధ (AI) సాయంతో సృష్టించిన మార్ఫ్డ్ చిత్రాల ద్వారా ఎన్టీఆర్ బ్రాండ్ ఇమేజ్ను దుర్వినియోగం చేస్తున్నట్లు ఆయన కార్యాలయం గుర్తించింది. దీనిపై ఎన్టీఆర్ న్యాయపోరాటానికి దిగారు.
కోర్టు తీర్పులో..
కేసును పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు.. ఎన్టీఆర్ ఒక అంతర్జాతీయ సెలబ్రిటీ అని, ఆయన పేరు మీద ఆయనకు మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. "NTR", "Jr. NTR", "Tarak", "Young Tiger", "Man of Masses" వంటి పేర్లను ఆయన అనుమతి లేకుండా ఎవరూ వాడకూడదని తెలిపింది. ఏఐ (AI) ద్వారా రూపొందించిన ఫోటోలు, డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫ్డ్ చిత్రాల ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచినా లేదా వ్యాపారాలకు వాడుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
►ALSO READ | విజయ్ దేనికీ భయపడడు.. ‘జన నాయగన్’ అడ్డంకులపై తండ్రి ఎస్.ఏ.సి సంచలన వ్యాఖ్యలు.!
వ్యక్తిత్వ హక్కులు అనేవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21 ప్రకారం జీవించే హక్కులో భాగమేనని కోర్టు అభిప్రాయపడింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సంస్థలు ఎన్టీఆర్ హక్కులకు భంగం కలిగించే కంటెంట్ను వెంటనే తొలగించాలని ఆదేశించింది. నటుడిగా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు ఆయన ఆస్తి. వాటిని ఇతరులు లాభాల కోసం వాడుకోవడం చట్టవిరుద్ధం అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది..
'డ్రాగన్' రిలీజ్ ఎప్పుడుంటే?
వరుస సినిమాలతో ఎన్టీఆర్ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ' డ్రాగన్ 'లో నటిస్తున్నారు. దేవర చిత్రంతో గ్లోబల్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన తారక్, ప్రశాంత్ నీల్ సినిమాలో మరింత ఊరమాస్ లుక్లో కనిపించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనితో పాటు 'వార్ 2' ద్వారా బాలీవుడ్ ఎంట్రీకి కూడా ఎన్టీఆర్ సిద్ధమయ్యారు. సినిమా రంగంలో రికార్డులు తిరగరాయడమే కాదు, తన హక్కుల విషయంలో కూడా ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇకపై 'యంగ్ టైగర్' పేరును వాడాలంటే ఎవరైనా సరే జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే మరి!
