ఖమ్మం జిల్లాకు చెందిన రమేశ్ ప్రస్తుతం హైదరాబాద్లో జాబ్చేస్తున్నాడు. గతంలో ఖమ్మంలో ఉన్నప్పుడు వెహికల్ తీసుకున్నాడు. దాన్ని ఇప్పుడు అమ్మాలనుకున్నాడు. జిల్లా మారితే ఆర్సీ ట్రాన్స్ ఫర్కు ఎన్వోసీ తప్పనిసరి. ఆ పని కోసం రమేశ్ సెలవు పెట్టి ఖమ్మం వెళ్లాల్సిన పరిస్థితి. ఆ పని కూడా ఒక్క రోజులో అయ్యేది కాదు. ఒక వేళ త్రీ టైర్ విధానం (ఆన్లైన్లో అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో సేవలు పొందడం) అమలులో ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు.
హైదరాబాద్, వెలుగు: ఆర్టీఏలో ఆన్లైన్ అమలువున్నా ఇంకా కొన్ని పనులకు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మొదట ఏ ఆఫీస్లో వెహికల్కు సంబంధించిన పని చేయించారో.. మళ్లీ ఆ పని రెన్యూవల్, ట్రాన్స్ఫర్కు పాత ఆఫీస్కే వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం జిల్లాలు మారి ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు.. గతంలో నివాసం ఉన్న ప్రాంతాలకు వెళ్లి పనులు చేయించుకుంటున్నారు. ఉదాహరణకు వెహికల్ ఫిట్నెస్ నల్గొండలో చేయిస్తే.. దాని రెన్యూవల్ కోసం తిరిగి అక్కడికే వెళ్లాలి. ఇక హైదరాబాద్ వంటి నగరంలో ఎల్బీనగర్ వాసులు ఇబ్రహీంపట్నంలోని మన్నెగూడ ఆర్టీఏ కార్యాలయంలోనే పనులు చేసుకోవాలి. కానీ ఎల్బీ నగర్ పక్కనే ఉన్న నాగోల్, ఉప్పల్ కార్యాలయాలకు వెళ్లలేరు. ఒక వేళ రాష్ట్రంలో ఎక్కడైనా డైరెక్టుగా ఇలాంటి సేవలు పొందాలంటే మొదట సంబంధిత సేవ పొందిన చోట నుంచి ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తేవాలి. అది ఉంటేనే ఏ ఆర్టీఏ కార్యాలయంలోనైనా సేవలు పొందవచ్చు. త్రీ టైర్ విధానం అమలులోకి వస్తే ఆన్లైన్లో అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏ సేవనైనా పొందే వీలుంటుంది. దీనిపై గతంలో అధికారులు కసరత్తు పూర్తి చేసినా అమలులో మాత్రం జాప్యం జరుగుతోంది.
పూర్తి స్థాయిలో ఆన్లైన్లోకి తేవాలి
ఆర్టీఏ కార్యాలయంలో ఆన్లైన్ సేవలు తీసుకొచ్చినప్పటికీ అది పూర్తి స్థాయిలో ఉపయోగపడటంలేదు. లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ చేయించుకోవాలంటే మొదట చేయించుకున్న కార్యాలయానికే వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా సమయం వృథా అవుతోంది. అదే త్రీ టైర్ విధానం పూర్తి స్థాయిలో తీసుకొస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏ ఆర్టీఏ కార్యాలయంలోనైనా పనులు చేసుకోవచ్చు. - చారి, హైదరాబాద్