
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను అర్చకులు ఉత్సవంలా నిర్వహించారు. ఆలయంలో నిత్య పూజలు ముగిసిన అనంతరం సాయంత్రం అద్దాల మండపంలో అమ్మవారికి ఊంజల్ సేవను చేపట్టారు. రకరకాల పూలు, బంగారు ఆభరణాలతో ఆండాళ్ అమ్మవారిని సుందరంగా ముస్తాబు చేసి అద్దాల మండపంలో ఉన్న స్వర్ణ ఊయలలో అధిష్ఠింపజేశారు. అనంతరం ప్రత్యేక పూజలతో ఊంజల్ సేవను నిర్వహించి శయనింపజేశారు.
వేదపండితుల మంత్రోచ్ఛారణలు, పారాయణీకుల వేదపారాయణాల మధ్య అమ్మవారికి ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు అమ్మవారినిఆలయ మాడవీధుల్లో విహరింపజేసి భక్తులకు దర్శనం కల్పించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.