
- వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్లో ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ హాస్పిటల్స్లో అవయవ మార్పిడి సర్జరీలను ప్రోత్సహించేందుకు అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఉన్నతాధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. నిమ్స్, గాంధీ, ఉస్మానియాతో పాటు ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ ఎంజీఎంలోనూ అవయవ మార్పిడి సర్జరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జీవన్ దాన్ పనితీరు, ప్రభుత్వ దవాఖాన్లలో అవయవ మార్పిడి చికిత్సలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం (సెప్టెంబర్ 10) జూబ్లీహిల్స్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ట్రాన్స్ప్లాంట్స్ కోసం సీనియర్ డాక్టర్లతో డెడికేటెడ్ టీమ్స్ ఏర్పాటు చేయాలని, ఒక్కో ఆర్గాన్కు ఒక్కో టీమ్ ఉండాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తుకు సూచించారు.
ప్రభుత్వ హాస్పిటల్స్లో అవయవ మార్పిడి సర్జరీలను ప్రోత్సహించే విధంగా ఈ టీమ్ లు పనిచేయాలన్నారు. ఇటీవల కేంద్ర చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నందున ఇందుకు తగ్గట్టు కొత్త నిబంధనల రూపకల్పనపై సమావేశంలో చర్చించారు. ఈ చట్టం ప్రకారం.. సొంత కుటుంబ సభ్యులతో పాటు, గ్రాండ్ పేరెంట్స్ కూడా అవయవాలు డొనేట్ చేసేందుకు, స్వీకరించేందుకు అర్హులేనని.. దీన్ని అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
ఆర్గాన్ డోనర్ల దహన సంస్కారాలకు ఆర్థిక సాయం
అవయవ దానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జీవన్దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ భూషన్రాజుకు మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. దీనికోసం ప్రజా ప్రతినిధులు, ప్రముఖుల సహకారం తీసుకోవాలన్నారు. ఆర్గాన్ డోనర్ల కుటుంబ సభ్యులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. బ్రెయిన్ డెత్ అయిన వారి అవయవాలను ఇతరులకు డొనేట్ చేసి ఆదర్శంగా నిలుస్తున్న కుటుంబాలను అందరూ అభినందించాలన్నారు.
ఆర్గాన్ డోనర్ల దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన ఆదేశించారు. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో జరుగుతున్న అవయవ మార్పిడి సర్జరీలపై నిరంతరం నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే హాస్పిటళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు.