కరోనాతో అందివస్తోన్న అవకాశాలు
2.7 కోట్లను క్రాస్ చేసిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్
గ్లోబల్ గా 8.7 కోట్ల యూజర్లు
ఇరోస్ నౌ యూజర్లు 1.4 కోట్లు
5 కోట్ల యూజర్లను యాడ్ చేసుకోవాలని టార్గెట్
ఓటీటీ ప్లాట్ఫామ్లు కొత్త సబ్స్క్రయిబర్లను పెంచుకునేందుకు చూస్తున్నాయి. కరోనా లాక్డౌన్ తర్వాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. కొత్త కంటెంట్తో ప్రజల ముందుకు వస్తున్నాయి. కొత్త షోలను అందిస్తూ… కొత్త సబ్స్క్రయిబర్లను చేర్చుకుంటామని ఇరోస్ నౌ చెబుతుండగా.. జియో భాగస్వామ్యంతో పలు రకాల ప్రోగ్రామ్స్ను డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఆఫర్ చేస్తోంది.
న్యూఢిల్లీ: ఇండియాలో డిస్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రయిబర్ల సంఖ్య 2.68 కోట్లను దాటినట్టు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ వెల్లడించింది. డిసెంబర్ నాటికి డిస్నీ ప్లస్కు ప్రపంచవ్యాప్తంగా 8.68 కోట్ల మంది యూజర్లు ఉన్నట్టు పేర్కొంది. ఈ యూజర్లలో 30 శాతం మంది డిస్నీ ప్లస్ హాట్స్టార్ యూజర్లని వెల్లడించింది. గ్లోబల్ సబ్స్క్రయిబర్ బేస్ 15 శాతం పెరిగినట్టు చెప్పింది. మొత్తంగా డిస్నీ పెయిడ్ సబ్స్క్రయిబర్లు డైరెక్ట్ టూ కన్జూమర్ సర్వీసులన్నింటినీ తీసుకుంటే 13.7 కోట్ల మంది ఉన్నారు. ఈ సంఖ్యను 2024 నాటికి 300–350 మిలియన్ సబ్స్క్రయిబర్లకు పెంచాలని కంపెనీ టార్గెట్గా పెట్టుకుంది. ఇండియాలో తాము ప్రత్యేకమైన స్థానంలో ఉన్నామని, ఇక్కడ మిడిల్ క్లాస్ జనాలు, వారి కొనుగోళ్ల శక్తి పెరుగుతుందని వాల్ట్ డిస్నీ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఛైర్మన్ రెబెకా కాంప్బెల్ అన్నారు. వాల్ట్ డిస్నీ ఇండియాలో టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ పార్టనర్షిప్లో భాగంగా జియో రిటైల్ యూజర్లు హాట్స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ కోసం నెలవారీ లేదా వార్షిక ప్యాక్స్ను, డేటా యాడ్ ఆన్ ఓచర్లను ఎంపిక చేసుకోవచ్చు. డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఏడు భాషల్లో పలు రకాల ప్రోగ్రామ్స్ను అందిస్తోందని రెబెకా చెప్పారు. కరోనా మహమ్మారితో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్న ఈ కంపెనీ.. పెద్ద పెద్ద బాలీవుడ్ ఫిల్మ్స్ను కొనుగోలు చేసింది. రూ.400 కోట్ల వరకు డీల్స్ కుదుర్చుకుంది.
ఇరోస్ నౌ టార్గెట్ 50 మిలియన్ల యూజర్లు…
మరో ఓటీటీ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ ఇరోస్ నౌ కూడా తన సబ్స్క్రయిబర్ బేస్ను 2023 మార్చి నాటికి 50 మిలియన్లకు పెంచుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ కస్టమర్ బేస్ 14 మిలియన్లుగా ఉంది. మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి కంటెంట్ను పెంచుతున్నట్టు కంపెనీ ఉన్నతాధికారి చెప్పారు. గత ఐదేళ్లలో కంటెంట్ క్రియేషన్ కోసం తాము 1 బిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేసినట్టు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అడిల్ హుస్సేన్ అన్నారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో 6.9 మిలియన్ల సబ్స్క్రయిబర్లు కొత్తగా యాడ్ అయినట్టు తెలిపారు. తాము కంటిన్యూగా కొత్త కస్టమర్లను యాడ్ చేసుకుంటున్నామని, టార్గెట్ను వచ్చే 18–24 నెలల్లో లేదా 2023 మార్చి వరకు చేరుకుంటామన్నారు.
46 కొత్త టైటిల్స్ రిలీజ్…
సబ్స్క్రిప్షన్ను పెంచేందుకు మరిన్ని మార్కెటింగ్ యాక్టివిటీలను కంపెనీ లాంచ్ చేస్తుందని తెలిపారు. పెద్ద మొత్తంలో తమకు సబ్స్క్రయిబర్లు టైర్ 3, 4 నగరాల నుంచే వస్తున్నట్టు చెప్పారు. స్థానిక భాషల్లో ఒరిజినల్ కంటెంట్ను చూసేందుకే ఎక్కువ మంది ఇష్టపడుతున్నట్టు వెల్లడించారు. 2021 నాటికి ఎనిమిది భాషల్లో 46 కొత్త టైటిల్స్ను రిలీజ్ చేస్తామని అన్నారు. ఈ కొత్త టైటిల్స్లో 13 ఒరిజినల్ సిరీస్, 33 ఫిల్మ్ ప్రీమియర్స్ ఉంటాయని హుస్సేస్ అన్నారు.సబ్స్క్రయిబర్ల నుంచే తమకు రెవెన్యూలు వస్తున్నట్టు హుస్సేన్ వెల్లడించారు. ఇక అమెజాన్ ప్రైమ్, ఆహా, జీప్లస్, సోనీ లైవ్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లు కొత్త కంటెంట్తో వస్తున్నాయి. సోనిలైవ్ ఇప్పటికే హర్షద్ మెహతా స్కాం:1992 పేరుతో హిట్కొట్టేసింది. ఆహాతో పాటు వూట్, ఎంఎక్స్ ప్లేయర్, ఏఎల్టీబాలాజీ, జియో టీవీ ప్లస్, హంగామా ప్లే, జియో సినిమా వంటి లోకల్ ఆపరేటర్లు కూడా 2021లో రూ.4,905 కోట్లను ఖర్చు చేయాలని భావిస్తున్నాయి.