
- మెరిట్ ఉన్న పేద స్టూడెంట్లు నష్టపోయే అవకాశం
- అబ్బాయిలకు 140, అమ్మాయిలకు 35 సీట్లే కేటాయింపు
- ఇయ్యాల్టితో హాస్టల్ అడ్మిషన్ గడువు పూర్తి
ఓయూ, వెలుగు: రీఫార్మ్స్ పేరుతో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తీసుకొచ్చిన కొత్త రూల్స్.. పేద స్టూడెంట్లకు శాపంగా మారుతున్నాయి. వర్సిటీకి 60 కిలోమీటర్ల లోపు నివాసముండే స్టూడెంట్లకు హాస్టల్ సౌలతులు కల్పించబోమని పేర్కొంటూ ఓయూలో కొత్త రూల్స్ తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఉత్తర్వులనూ జారీ చేశారు. పీజీఈసెట్లో ఇంజనీరింగ్ పీజీ (ఎమ్ఈ) సీట్లు పొందిన స్టూడెంట్లు హాస్టల్కు అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 4 వరకు గడువిచ్చారు. అయితే, 60 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉండేవాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలంటూ షరతు పెట్టారు. దీంతో క్యాంపస్కు 60 కిలోమీటర్ల లోపు ఉండి మెరిట్ కలిగిన పేద, మధ్య తరగతి స్టూడెంట్లకు హాస్టల్ దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. గడువు పూర్తి కావొస్తుండడంతో వాళ్లంతా ఆందోళన చెందుతున్నారు. ఈ రూల్తో సరైన రవాణా సౌలతులు లేని ప్రాంతాల్లో ఉండే పేద మెరిట్ స్టూడెంట్లు కాలేజీకి వచ్చి ఎలా చదువుకుంటారని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఈ రూల్ను మార్చి అడ్మిషన్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అతి కొద్ది మందికే హాస్టల్
ఓయూ క్యాంపస్లో వెయ్యికి పైగా ఎమ్ఈ సీట్లున్నాయి. అయితే, హాస్టల్ అడ్మిషన్ మాత్రం అతికొద్ది మందికే ఇస్తున్నారు. అబ్బాయిలకు 140 సీట్లనే అలాట్ చేశారు. అమ్మాయిలకైతే మరీ తక్కువగా ఇస్తున్నారు. కేవలం 30 నుంచి 35 మందికే హాస్టల్ వసతి కల్పిస్తున్నారు. 60 కిలోమీటర్ల కన్నా లోపున్నవాళ్లు అప్లై చేసుకున్నా అడ్మిషన్ ఇవ్వబోమని కరాఖండిగా చెప్తున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే రూములు తక్కువున్నయని అధికారులు చెప్తున్నారు. అమ్మాయిలకైతే బీఈ స్టూడెంట్లకు కేటాయించిన హాస్టళ్లలోనే నాలుగైదు రూముల్లో అడ్మిషన్ ఇస్తున్నారు. నిజానికి ఈ రూల్ను నిరుడు అప్పటి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్న ప్రొఫెసర్ కుమార్ తీసుకొచ్చారు. అప్పుడు కరోనా ఉండడంతో కేవలం ఆన్లైన్ క్లాసులే నడిచాయి. దీంతో హాస్టల్ సమస్య రాలేదు. ఇప్పుడు ఫిజికల్ క్లాసులు నడుస్తుండడంతో హాస్టల్ సమస్య తెరపైకి వచ్చింది. ఈ రూల్ పెట్టిన ప్రొఫెసర్ కుమార్ కూడా నగర శివార్ల నుంచే వచ్చి ఓయూ హాస్టల్లో ఉండి ఇంజనీరింగ్ పూర్తి చేశారని, ఊర్లల్లో ఉండే స్టూడెంట్లకు ఎదురయ్యే సమస్యలు తెలిసి కూడా ఇలాంటి రూల్ను ఎలా తీసుకొచ్చారని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు.
రూములు తక్కువున్నయ్
ఎమ్ఈ స్టూడెంట్ల కోసం ఒకటే హాస్టల్ ఉంది. అందులో ఎప్పుడూ 140 మందికి అడ్మిషన్లు ఇస్తున్నం. హాస్టల్లో ఉన్న గదులు చాలా తక్కువ. అడ్మిషన్లకు మాత్రం చాలా మంది అప్లై చేసుకున్నరు. ముందుగా దూర ప్రాంతాల స్టూడెంట్లకు అడ్మిషన్లు కల్పించాలన్న ఉద్దేశంతోనే 60 కిలోమీటర్ల రూల్ను పెట్టినం. దూరం నుంచే వచ్చేటోళ్లకు హాస్టల్ అడ్మిషన్లు ఇచ్చాక.. మిగిలిన సీట్లలో మిగతా వాళ్లకూ అడ్మిషన్ ఇస్తం.
- ప్రొఫెసర్ మంగూ నాయక్, ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ అడిషనల్ చీఫ్ వార్డెన్
అప్లికేషన్ కూడా తీసుకోవట్లేదు
మాది భువనగిరి దగ్గర గ్రామం. ఓయూలో ఎమ్ఈ సీటు వచ్చింది. హాస్టల్అడ్మిషన్ కోసం వెళ్తే.. ‘మీ ఊరు ఓయూకు 60 కిలోమీటర్ల లోపే ఉంది’ అని చెప్పి హాస్టల్ సౌలతు ఇవ్వట్లేదు. కనీసం అప్లికేషన్ కూడా తీసుకోవట్లేదు. బాగా చదువుకోవాలనే ఆశతో ఓయూలో చేరిన. తీరా హాస్టల్ఇవ్వకుంటే ఇంటి నుంచి ఎలా వచ్చేది? ఎలా కోర్సు పూర్తి చేసేది?
- రాజేందర్, యాదాద్రి భువనగిరి జిల్లా