- 24 గంటలు నడిచేలావరల్డ్ క్లాస్ రీసెర్చ్ ల్యాబ్స్
- లేడీస్, జెంట్స్కు సపరేట్గామెగా హాస్టల్స్
- డీపీఆర్ సిద్ధం చేస్తున్నవిద్యాశాఖ అధికారులు
- వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో ఉస్మానియాకు కొత్త కళ
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) రూపురేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. యూనిర్సిటీని ఇంటర్నేషనల్ స్థాయిలో మార్చేందుకు ప్లాన్ చేస్తున్నది. రూ. వెయ్యి కోట్లకు పైగా నిధులతో వర్సిటీకి కొత్త కళ తీసుకురాబోతున్నది. ఇందులో భాగంగా హైటెక్ అకడమిక్ బ్లాక్స్, వరల్డ్ క్లాస్ రీసెర్చ్ సెంటర్లు, మెగా హాస్టల్స్ నిర్మించబోతున్నారు.
ఇప్పటికే విద్యాశాఖ, ఓయూ ఆఫీసర్లు డీపీఆర్ రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. కన్వెన్షన్ హాల్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, హెల్త్ కేర్ సెంటర్, గ్రీనరీ డెవలప్మెంట్, సైకిల్ ట్రాక్, వాకింగ్ పాత్.. ఇలా వర్సిటీకి అన్ని హంగులనూ కల్పించబోతున్నారు. ఇప్పటికే వర్సిటీలో వసతులపై సీఎం రేవంత్ రెడ్డి పలుసార్లు సమీక్షలు నిర్వహించగా, ఈనెల 10న ప్రత్యక్షంగా ఓయూను సందర్శించనున్నారు.
మోడ్రన్ క్లాస్ రూమ్స్..
యూనివర్సిటీలో కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నేలా కొత్త అకడమిక్ బ్లాక్ను నిర్మించనున్నారు. ఇందులో మోడ్రన్, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అందులోనే స్టూడెంట్ల స్కిల్స్ పెంచేందుకు స్కిల్ సెంటర్, కమ్యూనికేషన్ డెవలప్మెంట్సెంటర్, సెమినార్ హాల్స్, ప్లేస్మెంట్ హాల్, సైకాలజీ కౌన్సిలింగ్ సెంటర్ను ఒకే దగ్గర ఏర్పాటు చేయబోతున్నారు.
పేటెంట్ ఆఫీస్ కూడా ఇందులోనే ఉంటుంది. రీసెర్చ్లో ఓయూ బ్రాండ్ ను పెంచేలా ‘రీసెర్చ్ బ్లాక్’ను ఏర్పాటు చేస్తారు. ఇందులో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో 30 అడ్వాన్స్డ్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నారు. వరల్డ్ క్లాస్ మిషనరీని ఇక్కడ పెట్టబోతున్నారు. ఈ బ్లాక్ 24 గంటలు ఓపెన్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. స్టూడెంట్ల వసతి కష్టాలు తీర్చేందుకు ‘మెగా హాస్టల్స్’ కడుతున్నారు.
1500 మంది కెపాసిటీతో అమ్మాయిలకు ఒక బిల్డింగ్, వెయ్యి మంది కెపాసిటీతో అబ్బాయిలకు మరో బిల్డింగ్ కట్టనున్నారు. హాస్టల్లోనే మినీ హాల్, రీడింగ్ రూమ్స్ ఉంటాయి. స్టూడెంట్ల ఫిట్నెస్ కోసం హాస్టల్ దగ్గరలోనే స్పెషల్ జిమ్స్ కూడా పెడుతున్నారు. పీహెచ్డీ స్కాలర్లకు ప్రత్యేకంగా ఒక్కొక్కరికీ ఒక గదిని కేటాయించనున్నారు. ఇక యూజీ, పీజీ స్టూడెంట్లకైతే ఒక గదిలో ఇద్దరు లేదా ముగ్గురు ఉండేలా ప్లాన్ చేశారు.
