గోధుమల ఎగుమతుల నిషేధంపై క్లారిటీ

గోధుమల ఎగుమతుల నిషేధంపై క్లారిటీ

యూఎన్: గోధుమల ఎగుమతులపై నిషేధం విధించడాన్ని విమర్శిస్తున్న పాశ్చాత్య దేశాలకు మన దేశం గట్టిగా బదులిచ్చింది. కరోనా వ్యాక్సిన్ల విషయంలో జరిగినట్లు ఆహార ధాన్యాల విషయంలో జరగకూడదని వ్యాఖ్యానించింది. కరోనా వ్యాక్సిన్లను అవసరానికి మించి పాశ్చాత్య దేశాలు నిల్వ చేసుకున్నాయని, ధనిక దేశాల వల్ల పేద దేశాలకు సింగిల్ డోసు వ్యాక్సిన్ కూడా అందలేదని ప్రస్తావించింది. అవసరంలో ఉన్న దేశాలకు సాయం చేసేందుకే.. తాము గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించామని వెల్లడించింది. ‘వసుదైక కుటుంబ’ భావనను కొనసాగిస్తామని వెల్లడించింది. రష్యా విషయంలో మన వైఖరిపై తరచూ విమర్శలు చేస్తున్న దేశాలకు వాటి ‘గురువింద గింజ’ నీతిని మరోసారి గుర్తుచేసింది. బుధవారం (అక్కడి టైం ప్రకారం) యూఎన్​లో ‘గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ కాల్ టు యాక్షన్’ అంశంపై జరిగిన మంత్రుల సమావేశంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ మాట్లాడారు. 

పేద దేశాలకు రెండు సవాళ్లు

‘‘ఎన్నో అల్ప ఆదాయ దేశాలు ధరల పెరుగుదల, ఆహార ధాన్యాల కొరత సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇండియా వంటి దేశాల్లో అవసరమైనంత మేరకు నిల్వలు ఉన్నప్పటికీ.. ఆహార ధాన్యాల రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలా అక్రమంగా నిల్వ చేయడం.. సరఫరాపై ఊహాగానాల వల్లే ఇదంతా జరుగుతోంది. దీన్ని ఇలానే మేం కొనసాగనివ్వబోం” అని మురళీధరన్ చెప్పుకొచ్చారు. ‘‘ఆహార ధాన్యాల విషయంలో సమానత్వం.. కొనగలిగే సామర్థ్యం.. అందుబాటులో ఉంచడం అనేవి చాలా ముఖ్యం. అన్ని దేశాలు ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తించాలి. కానీ ఈ సూత్రాలను కరోనా వ్యాక్సిన్ల విషయంలో ఎలా ఉల్లంఘించారో మనం చూశాం” అని చెప్పారు. ఆపదలో ఉన్న తన భాగస్వామ్య దేశాలకు.. కరోనా టైమ్​లోనూ సాయం చేసిన ట్రాక్ రికార్డు ఇండియాకు ఉందని మురళీధరన్ గుర్తు చేశారు.