‘ఇందిరమ్మ’ జాబితాలో అనర్హులు .. వనపర్తి మున్సిపాలిటీలోనే 100 మందికి పైగా అనర్హులకు ఇండ్లు కేటాయింపు

‘ఇందిరమ్మ’ జాబితాలో అనర్హులు .. వనపర్తి మున్సిపాలిటీలోనే 100 మందికి పైగా అనర్హులకు ఇండ్లు కేటాయింపు
  • ఒక్క వనపర్తి మున్సిపాలిటీలోనే 100 మందికి పైగా అనర్హులకు ఇండ్లు కేటాయింపు
  • కలెక్టర్​కు ఫిర్యాదులు భయపడి ప్రొసీడింగ్స్​ వాపస్​ ఇచ్చిన నలుగురు
  • చాలా గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని ఆరోపణలు

‘వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓ వార్డులో మున్సిపల్​మాజీ చైర్మన్ అనుచరుడి ఇంట్లో నలుగురికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. వీరికి ఇప్పటికే సొంత ఇల్లు ఉండడమే కాకుండా శ్రీమంతులు కూడా. కలెక్టర్​కు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు తమకు పొరపాటున ఇండ్లు వచ్చాయంటూ కమిషనర్​కు ప్రొసీడింగ్స్​ను వాపస్​ చేశారు.’

‘మరో వార్డులో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్​గా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న ఓ నాయకుడి తల్లి పేరిట, స్థానికంగా ఉండని అతని సమీప బంధువు పేరిట ఇండ్లు మంజూరయ్యాయి. ఓ రెడీమేడ్ ​షాప్​నిర్వాహకుడికి కూడా ఇల్లు మంజూరైంది. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి.’ 

‘జిల్లా కేంద్రంలోని 27, 28, 29వ వార్డుల్లో నిరుపేదలు వేళ్లమీద లెక్క పెట్టే సంఖ్యలో కూడా లేరు. అయినా ఇక్కడ 28 ఇండ్లు మంజూరయ్యాయి. ఎవరికి మంజూరు చేశారో అధికారులకే తెలియాలి.

వనపర్తి, వెలుగు: సొంత స్థలం ఉండి, ఇల్లు లేని నిరుపేదల సొంతింటి కల నెరవేర్చే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం తీసుకువచ్చింది. కాగా పలువురు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తమ స్వలాభం కోసం జాబితాలో అనర్హులను చేరుస్తున్నారు. వనపర్తి జిల్లాలో 6,700 ఇందిరమ్మ ఇండ్లకు గానూ 594 మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయి. వనపర్తి నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని, అనర్హులకు ఇండ్లు కేటాయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

 తాజాగా ఒక్క వనపర్తి మున్సిపాలిటీలోనే 575 ఇండ్లు మంజూరవగా 100కు పైగా ఇండ్లను అనర్హులకు కేటాయించారంటూ పలువురు కలెక్టర్​కు ఫిర్యాదులు చేశారు. దీంతో మున్సిపల్ ఆఫీసర్లు దిద్దుబాటు చర్యలకు దిగారు. పథకానికి ఎంపికైన వారి స్థలంలో ముగ్గు పోసి, దానికి జియోట్యాగింగ్​ చేయించి, అప్​లోడ్​ చేయాలి. ఇందులోనూ మాజీ ప్రజాప్రతినిధులు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న నాయకులు కొందరు అధికారులతో కలిసి చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. 

ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నవారే..

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం నియమించిన గ్రామ, వార్డు కమిటీల్లో సభ్యులను ఇష్టారీతిన చేర్చారు. మైనారిటీ తీరని యువకులు కూడా వీరిలో ఉండడం విశేషం. మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకునే ఔత్సాహికులు వార్డుల్లో తమకు కావాల్సిన వారి పేర్లను జాబితాలో అక్రమంగా చేర్చారన్న చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని పలువురు అంటున్నారు. 

వెరిఫికేషన్​ చేస్తున్న అధికారులు

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు   పెరుగుతుండడంతో అధికారులు వెరిఫికేషన్​ చేస్తున్నారు. జాబితాను వడపోయాలని భావిస్తున్నారు. ఫిర్యాదులు కలెక్టర్​వరకు వెళ్లడంతో ఖంగు తిన్న కొందరు అనర్హులు ఎప్పటికైనా బండారం బయటపడుతుందని భయపడి, తాము ఓ సమస్యపై దరఖాస్తు చేసుకుంటే పొరపాటున ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని చెబుతున్నారు. 

ఇప్పటికే తమకు ఇల్లు ఉందంటూ నలుగురు ప్రొసీడింగ్స్​ను వనపర్తి మున్సిపల్​ కమిషనర్​కు వాపస్​ ఇవ్వడం గమనార్హం. ఈ విషయమై కమిషనర్​ వెంకటేశ్వర్లును వివరణ కోరగా ఇప్పటివరకు నలుగురు వాపస్​ఇచ్చారని, ఇంకా ఎవరైనా అనర్హులుంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలని 
సూచించారు.