
- ఉమ్మడి జిల్లాలో సర్వే నంబర్ల మిస్సింగ్ అప్లికేషన్లు14,135
- దరఖాస్తుల పరిశీలనలో నిమగ్నమైన అధికారులు
కామారెడ్డి, నిజామాబాద్, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 918 రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 3 నుంచి 20 వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు జరిగాయి. ఆయా భూ సమస్యలపై 71,105 అప్లికేషన్లు రాగా, అత్యధికంగా సర్వే నంబర్ల మిస్సింగ్స్కు సంబంధించి 14,135 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో అప్లికేషన్ల పరిశీలనపై దృష్టి పెట్టారు. కామారెడ్డి జిల్లాలో 31,299 అప్లికేషన్లు రాగా, సర్వే నంబర్ల మిస్సింగ్స్ దరఖాస్తులు 7,239 ఉన్నాయి.
సాదాబైనామాలు 3,125, అసైన్డ్ భూములు 2,972, ఫారెస్ట్, రెవెన్యూ భూముల సరిహద్దు వివాదాలపై 2,656 దరఖాస్తులు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 39,806 అప్లికేషన్లు వచ్చాయి. సర్వే నంబర్ల మిస్సింగ్స్6,896 దరఖాస్తులు ఉన్నాయి. వీటితోపాటు పాస్ బుక్స్లో పేర్లు తప్పుపడటం, భూ విస్తీర్ణం తప్పులు, సర్వే కొలతల వంటి వాటిపై ఫిర్యాదులు వచ్చాయి.
అప్లికేషన్ల పరిశీలన..
రెవెన్యూ అధికారులు అప్లికేషన్లను పరిశీలిస్తున్నారు. ఆగస్టు 15లోగా పరిశీలన పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. మూడు రోజుల క్రితం కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ‘భూభారతి’ అప్లికేషన్లపై తహసీల్దార్లతో రివ్యూ నిర్వహించారు. ప్రతి అప్లికేషన్ను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
పైలట్ ప్రాజెక్ట్ లింగంపేటలో సక్సెస్..
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ‘ధరణి’ పోర్టల్ వల్ల భూ సమస్యలు పరిష్కారం కాకపోగా, ఎక్కువయ్యాయి. అధికారులు, ఆఫీసుల చుట్టూ తిరిగినా రైతులకు ఫలితం దక్కలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన లింగంపేట మండలంలో ‘భూభారతి’ సక్సెస్ అయ్యింది. మండలంలో 4,225 అప్లికేషన్లు రాగా, ఇప్పటికే వెయ్యి వరకు సమస్యలు పరిష్కారమయ్యాయి.
తర్వాత ప్రతి మండలంలో 2 టీమ్లు రోజుకు 2 గ్రామాల్లో సదస్సులు నిర్వహించాయి. ఒక టీమ్కు తహసీల్దార్, మరో టీమ్కు డిప్యూటీ తహసీల్దార్ బాధ్యులుగా ఉన్నారు. సదస్సులను ఎప్పటికప్పుడు కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు పర్యవేక్షించారు.