నిజామాబాద్ జిల్లాలో భూ సమస్యల పై అప్లికేషన్లు 71,105 .. ముగిసిన ‘భూభారతి’ రెవెన్యూ సదస్సులు

నిజామాబాద్ జిల్లాలో భూ సమస్యల పై అప్లికేషన్లు 71,105 .. ముగిసిన ‘భూభారతి’ రెవెన్యూ సదస్సులు
  • ఉమ్మడి జిల్లాలో సర్వే నంబర్ల మిస్సింగ్​ అప్లికేషన్లు14,135 
  • దరఖాస్తుల పరిశీలనలో నిమగ్నమైన అధికారులు

కామారెడ్డి, నిజామాబాద్​, వెలుగు :  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 918 రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 3 నుంచి 20 వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు జరిగాయి. ఆయా భూ సమస్యలపై 71,105 అప్లికేషన్లు రాగా, అత్యధికంగా సర్వే నంబర్ల మిస్సింగ్స్​కు సంబంధించి 14,135 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో అప్లికేషన్ల పరిశీలనపై దృష్టి పెట్టారు. కామారెడ్డి జిల్లాలో 31,299 అప్లికేషన్లు రాగా, సర్వే నంబర్ల మిస్సింగ్స్ దరఖాస్తులు 7,239 ఉన్నాయి.  

సాదాబైనామాలు 3,125,  అసైన్డ్ భూములు 2,972,  ఫారెస్ట్​, రెవెన్యూ భూముల సరిహద్దు వివాదాలపై 2,656 దరఖాస్తులు ఉన్నాయి.  నిజామాబాద్ జిల్లాలో 39,806 అప్లికేషన్లు వచ్చాయి. సర్వే నంబర్ల మిస్సింగ్స్​6,896 దరఖాస్తులు ఉన్నాయి. వీటితోపాటు పాస్ బుక్స్​లో పేర్లు తప్పుపడటం, భూ విస్తీర్ణం తప్పులు, సర్వే కొలతల వంటి వాటిపై ఫిర్యాదులు వచ్చాయి.  

అప్లికేషన్ల పరిశీలన..

రెవెన్యూ అధికారులు అప్లికేషన్లను పరిశీలిస్తున్నారు. ఆగస్టు 15లోగా పరిశీలన పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. మూడు రోజుల క్రితం కామారెడ్డి కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ ‘భూభారతి’ అప్లికేషన్లపై తహసీల్దార్లతో రివ్యూ ​ నిర్వహించారు. ప్రతి అప్లికేషన్​ను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.  

పైలట్ ప్రాజెక్ట్  లింగంపేటలో సక్సెస్​..

బీఆర్​ఎస్​ ప్రభుత్వం అమలు చేసిన ‘ధరణి’ పోర్టల్​ వల్ల భూ సమస్యలు పరిష్కారం కాకపోగా, ఎక్కువయ్యాయి. అధికారులు, ఆఫీసుల చుట్టూ తిరిగినా రైతులకు ఫలితం దక్కలేదు.  కాంగ్రెస్​ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. పైలట్​ ప్రాజెక్ట్  కింద ఎంపికైన లింగంపేట మండలంలో ‘భూభారతి’ సక్సెస్​ అయ్యింది. మండలంలో 4,225 అప్లికేషన్లు రాగా, ఇప్పటికే వెయ్యి వరకు సమస్యలు పరిష్కారమయ్యాయి.

 తర్వాత  ప్రతి మండలంలో 2 టీమ్​లు రోజుకు 2 గ్రామాల్లో సదస్సులు నిర్వహించాయి.  ఒక టీమ్​కు తహసీల్దార్​, మరో టీమ్​కు డిప్యూటీ తహసీల్దార్ బాధ్యులుగా ఉన్నారు.  సదస్సులను ఎప్పటికప్పుడు కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు పర్యవేక్షించారు.  ​