- నెలరోజులుగా సెంటర్లోనే ఓ రైతు పడిగాపులు
మంచిర్యాల, వెలుగు: కష్టపడి పండించిన ధాన్యాన్ని బస్తాకు 2 కిలోల చొప్పున కోత పెడ్తానంటే ఆ రైతు ఒప్పుకోలే. సర్కారు చెప్పినట్లు ఎలాంటి కోత లేకుండా తన వడ్లు కొనాలని డిమాండ్ చేశాడు. దీంతో సెంటర్ నిర్వాహకులకు కోపం వచ్చి నెలరోజులుగా వడ్లను కొనకపోవడంతో ఆ రైతు సెంటర్లోనే పడిగాపులు కాస్తున్నాడు. బాధితుడు చెప్పిన ప్రకారం.. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సోమన్పల్లికి చెందిన చందుపట్ల సాగర్రెడ్డి తనకున్న పదెకరాలతో పాటు మరో పదెకరాలు కౌలుకు తీసుకుని వరి వేశాడు. మొత్తం 1100 బస్తాలకు పైగా 400 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మొదటి విడత వడ్లను సెంటర్ ఓపెన్ చేయకముందే ఏప్రిల్ 18న సోమన్పల్లి డీసీఎంఎస్ సెంటర్కు తీసుకెళ్లి ఆరబోశాడు. 27న రెండో విడతలో కోసిన వడ్లను సెంటర్కు తరలించాడు. సెంటర్ నిర్వాహకులు వడ్లు మంచిగ లేవని బస్తాకు 3 కిలోలు కటింగ్ పెట్టడంతో సాగర్రెడ్డి ప్రశ్నించాడు. దీంతో నిర్వాహకులు కక్షగట్టి సీరియల్ ప్రకారం మూడో నంబర్ అయినప్పటికీ వడ్లను ఆలస్యంగా కాంటా వేశారు. ఏప్రిల్ 22న 440 బస్తాలను సమీప రైస్ మిల్లుకు తరలించారు. అక్కడ బస్తాకు మరో కిలో నుంచి 2 కిలోలు కట్ చేస్తామన్నారు. దీనికి ఒప్పుకోకపోవడంతో మిల్లర్లు ఇప్పటికీ ట్రక్షీట్ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఇక రెండో విడతలో కోసిన వడ్లను నేటికీ కాంటా పెట్టడం లేదని రైతు సాగర్రెడ్డి చెప్పాడు. కటింగ్కు ఒప్పుకోకపోవడంతోనే మరో 700 బస్తాల వడ్లను కొంటలేరని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఆఫీసుల్లో రాతపూర్వకంగా కంప్లైంట్ చేసినా ఫలితం దక్కలేదన్నాడు. సెంటర్ నిర్వాహకులు, మిల్లర్లు కలిసి బస్తాకు 8 కిలోల చొప్పున కోత పెడ్తున్నారని, తమకు అనుకూలంగా ఉన్న రైతులవి ముందుగా కాంటా వేస్తున్నారని ఆరోపించాడు.
మిల్లర్లే కోత పెడుతున్నరు..
క్వాలిటీ ఉన్న వడ్లకు సెంటర్లో ఎలాంటి కోతలు పెట్టడం లేదు. మిల్లర్లు మాత్రం తాలు, తప్ప ఉందని కటింగ్ పెడుతున్రు. ఒప్పుకోకుంటే వడ్లు దించుకోకుండా ఇబ్బంది పెడుతున్రు. సాగర్రెడ్డి వడ్లను కాగజ్నగర్లోని రైస్మిల్లుకు పంపించాం. మిల్లర్ ఇంకా ట్రక్షీట్ ఇయ్యలే. ఇది రైతుకు చెప్పాం. మిగిలిన వడ్లను మీకు (డీసీఎంఎస్ సెంటర్) ఇయ్య అన్నాడు. అందుకే ఆయన వడ్లను కాంటా వేయలే. సెంటర్లో కటింగ్ పెడుతున్నామని, రైతులను ఇబ్బంది పెడుతున్నామని ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు.
