టెన్నిస్ లెజెండ్కు దేశ మూడో అత్యున్నత పురస్కారం.. రోహిత్, హర్మన్ ప్రీత్కు పద్మశ్రీ
న్యూఢిల్లీ: ఇండియా టెన్నిస్ లెజెండ్ విజయ్ అమృత్రాజ్ దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్కు ఎంపికయ్యాడు. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్స్ రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ పద్మశ్రీ అవార్డుకు సెలెక్టయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన ఈ అవార్డుల్లో స్పోర్ట్స్ నుంచి మొత్తం తొమ్మిది మంది ఎంపికయ్యారు. ఇండియా టెన్నిస్ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినందుకు గానూ విజయ్ అమృత్రాజ్ కు పద్మభూషణ్ దక్కింది. విజయ్ గతంలో వింబుల్డన్, యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకోవడంతో పాటు, 1974లో అర్జున, 1983లో పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నాడు. డేవిస్ కప్లో మేటి ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్న అమృత్రాజ్.. స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్గానూ దేశ క్రీడా రంగానికి సేవలు అందించాడు. ఇక, ఇండియన్ క్రికెట్కు చారిత్రాత్మక విజయాలు అందించిన రోహిత్, హర్మన్ప్రీత్ను ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. కెప్టెన్గా టీమిండియాకు 2024 టీ20 వరల్డ్కప్, 2025 చాంపియన్స్ ట్రోఫీని అందించిన రోహిత్ తన నాయకత్వ పటిమకు గుర్తింపుగా ఈ పురస్కారం అందుకున్నాడు. గతేడాది స్వదేశంలో జరిగిన ఐసీసీ విమెన్స్ వన్డే వరల్డ్ కప్లో ఇండియాను విజేతగా నిలిపిన తొలి కెప్టెన్గా హర్మన్ చరిత్ర సృష్టించింది. పారాలింపిక్ గోల్డ్ మెడల్ విన్నింగ్ హై జంపర్ ప్రవీణ్ కుమార్ (యూపీ), విమెన్స్ హాకీ టీమ్ గోల్ కీపర్ సవితా పునియా (హర్యానా), హాకీ మాజీ ప్లేయర్, కోచ్ బల్దేవ్ సింగ్ (పంజాబ్) తోపాటు మార్షల్ ఆర్ట్స్ ఇన్స్రక్టర్స్ భగవాన్ దాస్ రైక్వార్ (మధ్యప్రదేశ్), కె. పజనివేల్ (పుదుచ్చేరి)కి పద్మశ్రీ లభించింది. ఇండియన్ రెజ్లింగ్ పితామహుడిగా పేరు తెచ్చుకున్న జార్జియాకు చెందిన కోచ్ వ్లాదిమిర్ మెస్ట్విరిష్విలి( మరణానంతరం) పద్మశ్రీకి ఎంపికయ్యాడు.
